ధరణి అధికారాల బదిలీ

భూ సమస్యల సత్వర పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇప్పటివరకు దరఖాస్తులను పరిష్కరించాలంటే జిల్లా కలెక్టర్‌ బయోమెట్రిక్‌ అనుమతి తప్పనిసరి.

Updated : 26 Feb 2024 06:45 IST

కలెక్టర్ల నుంచి తహసీల్దార్లు, ఆర్డీవోలకు..
భూసమస్యల పరిష్కారంపై సర్కారు కసరత్తు
ఈనాడు - హైదరాబాద్‌

భూ సమస్యల సత్వర పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇప్పటివరకు దరఖాస్తులను పరిష్కరించాలంటే జిల్లా కలెక్టర్‌ బయోమెట్రిక్‌ అనుమతి తప్పనిసరి. తహసీల్దార్‌ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించిన ప్రభుత్వం.. మరింత వేగంగా భూసమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకే అధికారాలు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త ఆర్వోఆర్‌ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ల అధీనంలో ఉన్న అధికారాల్లో కొన్నింటిని తహసీల్దార్లు, ఆర్డీవోలకు బదలాయించనుంది. దీనికోసం జీవో జారీ చేయాలా లేదా సర్క్యులర్‌ ద్వారా చర్యలు చేపట్టాలా అన్న అంశంపై నిపుణులు సమాలోచన చేస్తున్నారు. ధరణి కమిటీ సైతం అధ్యయనం చేస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు మొదట పెండింగ్‌ సమస్యలతో ప్రారంభించి.. ఫలితాలను బట్టి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు.

అధికారాల బదలాయింపుతోనే..

2020లో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం భూ దస్త్రాల్లో మార్పులు-చేర్పులన్నీ కలెక్టర్లు మాత్రమే చేస్తున్నారు. తీరిక లేని విధులుండటంతో వారి స్థాయిలో భూ సమస్యలు, దస్త్రాలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. తహసీల్దారు, ఆర్డీవోలకు కొన్ని అధికారాలు అప్పగిస్తే కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గుతుందని, సమస్యల పరిష్కారంలో వేగమూ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు రెవెన్యూ చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఉందా లేక ఉత్తర్వు ద్వారానే ఈ పద్ధతిని మార్చవచ్చా అనే అంశంపై వారు దృష్టి సారించారు.   యాజమాన్య హక్కుల కల్పన, సవరణలన్నీ కలెక్టర్లు చేస్తున్నా.. తుది దస్త్రంపై తహసీల్దార్ల సంతకాలే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విధులు బదిలీ చేస్తే సరిపోతుందని, దీనికి శాఖ అంతర్గత ఆదేశాలు చాలని పలువురు సీనియర్‌ అధికారులు సూచించినట్లు తెలిసింది. కొద్ది రోజుల్లో దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పెండింగ్‌ తక్కువ చూపేందుకు తిరస్కరణ!

ధరణి ప్రారంభమైన 2020 అక్టోబరు 29 నుంచి ఈ ఏడాది జనవరి వరకు పోర్టల్‌కు 16.57 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 2.40 లక్షల దరఖాస్తులను పెండింగ్‌లో చూపుతున్నారు. ఇప్పటివరకు 6.38 లక్షల అర్జీలనే పరిష్కరించారు. తిరస్కరణకు గురైనవి 5.37 లక్షలు ఉన్నాయి. ప్రభుత్వం సమీక్ష చేసిన ప్రతిసారీ కొన్ని జిల్లాల్లో తక్కువ దరఖాస్తులే పెండింగ్‌లో ఉన్నాయని చూపేందుకు ఎడాపెడా తిరస్కరించేవారని రెవెన్యూవర్గాల సమాచారం. దరఖాస్తుల్లో చిన్న తప్పున్నా, ఆధారాలు లేకపోయినా తిరస్కరించిన దాఖలాలు కోకొల్లలు. ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన క్రమంలో తిరస్కరించిన దరఖాస్తుల్లోనూ అర్హత ఉన్నవాటికి మోక్షం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

పాసుపుస్తకాల్లోని పొరపాట్లు సరిదిద్దడంలోనూ జాప్యమే..

  • పాసుపుస్తకాల్లో పేర్లు, సర్వే విస్తీర్ణం, ఖాతా సంఖ్య, ఆధార్‌ నంబర్‌, చిరునామా లాంటివి తప్పుగా నమోదు కాగా.. వాటిపై వచ్చిన అర్జీల్లో 2.43 లక్షల దరఖాస్తులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి.
  • వీటి పరిష్కారంలో జాప్యానికి క్షేత్రస్థాయి విచారణ ఒక కారణమైతే.. కలెక్టరేట్లలో సిబ్బంది ఉదాసీన వైఖరి కూడా కొంతమేరకు కారణమని బాధితులు చెబుతున్నారు.
  • ధరణి ప్రారంభం నుంచి భూ సంబంధిత సమస్యలపై 4.30 లక్షల దరఖాస్తులు రాగా.. తిరస్కరించినవి పెద్దసంఖ్యలో ఉన్నాయి.
  • సాగు భూములను సాగేతర భూములుగా తప్పుగా నమోదు చేశారంటూ దాఖలైన వాటిలో 25 శాతం పెండింగ్‌లో ఉన్నాయి.
  • ఎప్పుడో వ్యవసాయేతర భూమిగా మారగా ఇప్పటికీ సాగుభూమిగా చూపుతున్నారంటూ దాఖలైనవి 32.44 శాతం, మైదాన ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు 22.72 శాతం పెండింగ్‌లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని