మేడిగడ్డ ఘటనపై 3 కేసులు..

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, పియర్స్‌ దెబ్బతినడంపై దర్యాప్తు చేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాథమికంగా మూడు కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది.

Updated : 28 Feb 2024 05:31 IST

నమోదుకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిఫార్సు!

ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, పియర్స్‌ దెబ్బతినడంపై దర్యాప్తు చేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాథమికంగా మూడు కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. నిర్మాణసంస్థ ఎల్‌ అండ్‌ టీతో పాటు ఇటీవల కాళేశ్వరం (రామగుండం) ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా తొలగించిన వెంకటేశ్వర్లుపై కేసులు నమోదు చేయాలంటూ ఇందుకు సంబంధించిన కారణాలను వివరించినట్లు సమాచారం. సీఐడీ ద్వారా కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేయాలని కోరినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. పని పూర్తికాకముందే పూర్తయినట్లు, డిఫెక్ట్‌ లయబులిటీ పీరియడ్‌ ప్రారంభమైందని, బ్యాంకు గ్యారంటీలు వెనక్కు ఇవ్వాలని గత ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు సిఫార్సు చేయడం.. దీనివల్ల బ్యారేజీకి నష్టం వాటిల్లినపుడు గుత్తేదారు మరమ్మతులు చేయకపోయినా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నట్లు తెలిసింది. ఈఎన్‌సీ రాసిన ఈ లేఖ ఆధారంగా రూ.150 కోట్ల బ్యాంకు గ్యారంటీలను విడుదల చేశారని, తర్వాత తమను తప్పుదోవ పట్టించారంటూ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (జనరల్‌) నోటీసు ఇవ్వడాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. పని పూర్తిచేయకుండానే పూర్తయినట్లుగా ధ్రువీకరణ పత్రం తీసుకోవడం.. పని పూర్తయి డిఫెక్ట్‌ లయబులిటీ పీరియడ్‌ ప్రారంభమైందని అప్పటి ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు ఉన్నతాధికారులకు నివేదించినా కింది ఇంజినీర్లకు ఈ సమాచారం ఇవ్వకపోవడం.. కింది ఇంజినీర్లు బ్యారేజీలో దెబ్బతిన్న పనులను బాగుచేయాలంటూ లేఖలు రాయడం గురించి కూడా వివరంగా పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాఫర్‌డ్యాం నిర్మాణం చేపట్టి బ్యారేజీ నిర్మాణం తర్వాత వాటిని తొలగించాల్సి ఉన్నా తొలగించకుండా వదిలేయడం, దీనివల్ల ప్రవాహంలో వచ్చిన మార్పుతో జరిగిన నష్టం, అంచనాలోనే కాఫర్‌డ్యాం నిర్మాణానికి, తొలగించడానికి అయ్యే వ్యయం ఉన్నా, తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపైన కూడా మరో కేసు నమోదు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది.

బ్యారేజీ ఎగువ భాగంలో ఇసుకను ఓ మట్టానికి తేవడం, సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవడం వంటివి చేయకుండా వదిలిపెట్టడం గురించి ప్రశ్నించినట్లు సమాచారం. గుత్తేదారు చేసిన పనిని ఎం.బుక్కులో రికార్డు చేయడం, దీని ఆధారంగా బిల్లు చెల్లించడానికి పే అండ్‌ ఎకౌంట్స్‌ (పీఏవో)కు సిఫార్సు చేయడం, పీఏవో బిల్లు చెల్లించడం జరుగుతుంది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఎం.బుక్కులు ఇమ్మని కోరగా, సంబంధిత ఇంజినీర్‌ వీటికోసం గుత్తేదారుకు లేఖ రాశారు. అయితే ఇప్పటివరకు ఈ ఎం.బుక్కులు అందకపోవడంతో పే అండ్‌ ఎకౌంట్స్‌ నుంచి పరిశీలించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇందులో కూడా పలు లోపాలను గుర్తించినట్లు తెలిసింది. ఎం.బుక్కులో కొట్టివేతలతోపాటు రికార్డు చేయడంలో వరుసక్రమం లేకపోవడం గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదట పైన పని చేసినట్లు ఎం.బుక్కులు రికార్డు చేయడం, తర్వాత కింది పనికి రికార్డు చేయడం ఇలా పలు అవకతవకలు గుర్తించామంటూ దీనిపైన కూడా కేసు నమోదుకు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ బ్యారేజీ నిర్మాణ వ్యయం పెరగడం, ఇలా పెరిగిన పనులన్నీ అనధికార ఉప గుత్తేదారులు చేయడం, బిల్లు ప్రధాన గుత్తేదారు నుంచి ఉప గుత్తేదారులకు రావడం, వీరికున్న అర్హతలు తదితర అంశాలపై కూడా విచారణ పూర్తిచేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ త్వరలోనే మరికొన్ని కేసుల నమోదుకు సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రతన్‌ మంగళవారం సంబంధిత అధికారులతో చర్చించి 3 కేసుల నమోదుకు గల కారణాలను వివరంగా పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫార్సు చేసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని