కాళేశ్వరంపై అధ్యయనానికి ఎన్‌డీఎస్‌ఏ కమిటీ

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీకి కారణాలను అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసేందుకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీని నియమించింది.

Published : 01 Mar 2024 05:13 IST

ఛైర్మన్‌గా చంద్రశేఖర్‌ అయ్యర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీకి కారణాలను అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసేందుకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో మరో ఐదుగురు సభ్యులున్నారు. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ కుంగి, పియర్స్‌ దెబ్బతిన్న తర్వాత అనిల్‌ జైన్‌ నాయకత్వంలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ బృందం పర్యటించింది. బ్యారేజీని పరిశీలించడంతోపాటు నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి నివేదిక ఇచ్చింది. బ్యారేజీకి సంబంధించిన పలు వివరాలను కోరింది. డిజైన్‌, నాణ్యత, నిర్వహణ ఇలా పలు అంశాల్లో లోపాలను ఎత్తిచూపింది. బ్యారేజీలో నీటిని తొలగించి వైఫల్యానికి కారణాలను తెలుసుకొనేందుకు పలు సూచనలు చేసింది. మరో ముగ్గురు సభ్యుల బృందం అన్నారం బ్యారేజీలో సీపేజీని పరిశీలించింది. మేడిగడ్డ కుంగుబాటుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు చేయించింది. బ్యారేజీల పటిష్ఠతను నిర్ధారించడంతోపాటు ఏమేం చర్యలు తీసుకోవాలనే విషయంలో సిఫార్సులు చేసేందుకు నిపుణుల కమిటీని పంపాలని ఫిబ్రవరి 13న నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా కేంద్ర జల సంఘం ఛైర్మన్‌కు, ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్‌కు లేఖ రాశారు. దీనిపై గత కొన్ని రోజులుగా కసరత్తు చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ.. చంద్రశేఖర్‌ అయ్యర్‌ను ఛైర్మన్‌గా, డిజైన్స్‌, హైడ్రాలజీ తదితర రంగాలకు చెందిన ఐదుగురు నిపుణులను సభ్యులుగా నియమించింది. చంద్రశేఖర్‌ అయ్యర్‌ గోదావరి బోర్డు ఛైర్మన్‌గా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా, పోలవరం ప్రాజెక్టు సీఈవోగా కూడా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని