ఆ ఎం.బుక్కే లేదు

మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పని పూర్తయినట్లు 2021 మార్చి 15న ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు.

Updated : 03 Mar 2024 07:08 IST

మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం
టైపింగ్‌లో పొరపాటు జరిగింది
విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీకి ఈఈ తిరుపతిరావు లేఖ
ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేయాలని దర్యాప్తు సంస్థ నిర్ణయం
ఈనాడు - హైదరాబాద్‌

మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పని పూర్తయినట్లు 2021 మార్చి 15న ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. చేసిన పనిని, దానికి సంబంధించిన బిల్లును రికార్డు చేసినట్లు (ఏఎంబీ-నం-56/2018) అందులో పేర్కొన్నారు. దాని ప్రకారం ఏ పని ఎంత మేరకు జరిగింది, ఆ పనికి చెల్లించే మొత్తం ఎంత... అనే వివరాలన్నీ అందులో ఉంటాయి. ఈ బిల్లు ఆధారంగా పని పూర్తయినట్లు ధ్రువీకరణ ఇచ్చినందున ఆ వివరాలు సమర్పించాలని విజిలెన్స్‌ కోరింది.

మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తులో అనేక అసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పని పూర్తయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్న మెజర్‌మెంట్‌ బుక్‌(ఎం.బుక్‌) అసలు లేనే లేదని దర్యాప్తులో తేలింది. తుది బిల్లుకు సంబంధించిన వివరాలు అందజేయాలని దర్యాప్తు సంస్థ కోరగా, పని పూర్తయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్న వివరాలు లేవని, పొరపాటున ఒక ఎం.బుక్‌ నంబరు బదులు మరో ఎం.బుక్‌ నంబరు వేశామని పేర్కొంటూ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ తిరుపతిరావు విజిలెన్స్‌ ఎస్పీకి లేఖరాశారు. ఈ నేపథ్యంలో దీనిపై మరింత లోతుగా విచారణ చేయాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  

మినిట్స్‌కు భిన్నంగా...

2019 జూన్‌లో నాటి సీఎం కేసీఆర్‌ మేడిగడ్డను ప్రారంభించారు. అదే సంవత్సరం జనవరిలో కాళేశ్వరం మొదటి లింక్‌ను పరిశీలించిన ఆయన బ్యారేజీకి సంబంధించిన అన్ని పనులను ఏప్రిల్‌ 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణీత లక్ష్యం మేరకు పని పూర్తి చేయడానికి రోజుకు పదివేల క్యూబిక్‌మీటర్ల కాంక్రీటు పని చేయాలని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీని ఆదేశించారు. బ్యారేజీ ఎగువన గైడ్‌ బండ్స్‌, ఫ్లడ్‌ బ్యాంక్స్‌ పనులను మార్చిలోగా పూర్తి చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన మినిట్స్‌ను అప్పటి సీఎం ఓఎస్డీ ఆ ఏడాది జనవరి 6న సంబంధిత వర్గాలకు పంపారు. ఆ మినిట్స్‌లో వివరాలు అలా ఉండగా 56/2018 బిల్లుతోనే పని పూర్తయినట్లు ఎలా ధ్రువీకరణ పత్రం ఇచ్చారో తెలుసుకొనేందుకు దర్యాప్తు సంస్థ సమాచారం కోరింది.

ఆ ఎం.బుక్కే లేదని, టైపింగ్‌లో పొరపాటు జరిగిందని, వాస్తవానికి అది 65/2020 అని పేర్కొంటూ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ తిరుపతిరావు విజిలెన్స్‌కు సమాధానమిచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్ణయించినట్లు సమాచారం. పని పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తర్వాత కూడా పలు పనులు పెండింగ్‌లో ఉన్నట్లు నిర్మాణ సంస్థకు ఇంజినీర్లు లేఖలు రాసిన అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పని పూర్తయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో ఏయే పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయో ఎందుకు నమోదు చేయలేదని కూడా ప్రశ్నిస్తూ దర్యాప్తు సంస్థ అధికారుల వివరణ కోరినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని