నీళ్లు సాధించుకుందాం.. ధైర్యం కోల్పోవద్దు: కేసీఆర్‌

‘పంటలు ఎండిపోయాయని.. ధైర్యం కోల్పోవద్దు. పోరాడి.. మన నీళ్లను మనం సాధించుకుందాం. 24 గంటల కరెంటు, రైతు రుణమాఫీ, రైతు బంధును పోరాడి తెచ్చుకుందాం’ అని  భారాస అధినేత కేసీఆర్‌ అన్నదాతలకు భరోసా ఇచ్చారు.

Published : 01 Apr 2024 05:52 IST

పంట నష్టపోయిన రైతులకు భరోసా

ఈనాడు-మహబూబాబాద్‌, నల్గొండ, దేవరుప్పుల రూరల్‌-న్యూస్‌టుడే: ‘పంటలు ఎండిపోయాయని.. ధైర్యం కోల్పోవద్దు. పోరాడి.. మన నీళ్లను మనం సాధించుకుందాం. 24 గంటల కరెంటు, రైతు రుణమాఫీ, రైతు బంధును పోరాడి తెచ్చుకుందాం’ అని  భారాస అధినేత కేసీఆర్‌ అన్నదాతలకు భరోసా ఇచ్చారు. ఆదివారం ఆయన జనగామ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించి.. ఎండిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి కారణాలు అడిగితెలుసుకున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి బస్సులో బయలుదేరిన కేసీఆర్‌ మధ్యాహ్నం 12:06 గంటలకు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్‌ తండాకు చేరుకున్నారు. ఎండిన పంట పొలాలను స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. రైతులు తమ సమస్యలను విన్నవించారు. రూ.60 వేల పెట్టుబడి పెట్టి మూడెకరాల్లో సాగు చేసిన వరిపంట చివరి దశలో నీరందకపోవడంతో.. రూ.80 వేల ఖర్చుతో రెండు బోర్లు వేయించినా నీరు పడలేదని, అప్పులు మిగిలాయని మహిళా రైతు జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. బంజరకు చెందిన దివ్యాంగ రైతు మాలోతు లక్ష్మణ్‌ కేసీఆర్‌ కాళ్లపై పడి తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘మూడెకరాల్లో వరిసాగు చేశాను. బావి, రెండు బోర్లు ఉన్నా.. నీళ్లు లేకపోవడంతో రూ.65 వేలతో రెండు బోర్లు వేసినా నీరు పడలేదు. పంట ఎండిపోయింది’ అని వాపోయారు. చింతబావి తండాకు చెందిన ధన్‌సింగ్‌ మాట్లాడుతూ.. గతంలో కాలువల ద్వారా నీళ్లొచ్చేవని, ఈసారి  నీళ్లు రాక నాట్లు పూర్తిగా ఎండిపోయాయని తెలిపారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి, సూర్యాపేట మండలం ఎల్కారంలో పంటలను పరిశీలించారు. ఐదెకరాల్లో పంట నష్టం జరిగిందని దంపతులు కొదంగుండ్ల వెంకటయ్య, సరోజన ఆయనకు తెలిపారు. కేసీఆర్‌ వెంట ఎంపీలు మాలోత్‌ కవిత, బడుగుల లింగయ్యయాదవ్‌, మాజీ మంత్రులు దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, నల్గొండ, భువనగిరి లోక్‌సభ అభ్యర్థులు కంచర్ల కృష్ణారెడ్డి, క్యామా మల్లేశం, పలువురు నేతలు ఉన్నారు.

మహిళా రైతు కుమారుడి పెళ్లికి రూ.5 లక్షల సాయం

జనగామ జిల్లా ధరావత్‌ తండాలో కేసీఆర్‌కు మహిళా రైతు సత్తెమ్మ తన గోడు విన్నవించారు. ఎనిమిదెకరాల్లో వరి సాగు చేస్తే మొదట్లోనే రెండెకరాలు ఎండిపోయాయని, మిగిలిన ఆరెకరాలను కాపాడుకునేందుకు రూ.1.60 లక్షలతో బోర్లు వేయించానని తెలిపారు. ఒక్కదాంట్లోనూ చుక్కనీరు రాలేదని విలపించారు. పంట చేతికొస్తుందని ఆశించి కుమారుడి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నామంటూ పెళ్లి కార్డును కేసీఆర్‌కు ఇచ్చారు. పెళ్లి చేయడానికి డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మాజీ మంత్రి దయాకర్‌రావును కేసీఆర్‌ పిలిచి.. ఆమె కుమారుడి పెళ్లికి పార్టీ తరఫున రూ.5 లక్షలు ఇద్దామని, పూర్తి వివరాలు తీసుకోవాలని సూచించారు.

చెక్‌పోస్టు వద్ద కేసీఆర్‌ వాహనం తనిఖీ

జనగామ జిల్లాలో పర్యటన అనంతరం కేసీఆర్‌ సూర్యాపేటకు వెళ్తుండగా.. ఆయన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా కొడగండ్ల మండలం మొండ్రాయి క్రాస్‌రోడ్‌ కూడలిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద కేసీఆర్‌ ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపి.. లోపలికి వెళ్లి క్షుణ్నంగా పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని