గురుకులాల్లో ఆర్ట్స్‌ టీచర్‌ పోస్టులకు మళ్లీ పరీక్ష

గురుకుల విద్యాసంస్థల్లో ఆర్ట్స్‌ టీచర్‌ పోస్టులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక మండలి (టీఆర్‌ఈఐఆర్‌బీ)కి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

Published : 12 Apr 2024 05:42 IST

 ప్రశ్న పత్రం తెలుగు, ఆంగ్లంలో ఉండాలని స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థల్లో ఆర్ట్స్‌ టీచర్‌ పోస్టులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక మండలి (టీఆర్‌ఈఐఆర్‌బీ)కి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష నోటిఫికేషన్‌కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. గురుకుల విద్యాసంస్థల్లో 132 ఆర్ట్స్‌ టీచర్‌ పోస్టులకు గత ఏడాది ఆగస్టు 1న నిర్వహించిన పరీక్షలో ప్రశ్నలను తెలుగులో ఇవ్వకుండా కేవలం ఆంగ్లంలోనే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన జి.వినోద్‌తోపాటు వివిధ జిల్లాలకు చెందిన మరో 8 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఆకాశ్‌ బాగ్లేకర్‌ వాదనలు వినిపిస్తూ.. ఆర్ట్స్‌ టీచర్‌ పోస్టులకు టీఆర్‌ఈఐఆర్‌బీ 2023 ఏప్రిల్‌ 5న నోటిఫికేషన్‌ జారీ చేసిందని, ప్రశ్న పత్రం తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉంటుందని అందులో పేర్కొందన్నారు. అయితే ఆగస్టు 1న ఆన్‌లైన్‌ పరీక్ష ప్రశ్నపత్రం కేవలం ఆంగ్లంలో మాత్రమే ఉందన్నారు. దీనివల్ల పిటిషనర్లు పరీక్ష సరిగా రాయలేకపోయారని, ఇది తెలుగు తెలిసినవారి పట్ల వివక్ష చూపడమేనని, అంతేగాకుండా రాజ్యాంగంలోని షెడ్యూలు 8, అధికరణ 14కు విరుద్ధమన్నారు. టీఆర్‌ఈఐఆర్‌బీ తరఫు న్యాయవాది ఎన్‌.రమేశ్‌ వాదనలు వినిపిస్తూ గురుకుల విద్యాసంస్థలన్నీ ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తున్న అయిదు రెసిడెన్షియల్‌ సొసైటీల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయన్నారు.

2017లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కూడా ఆంగ్లంలోనే పరీక్ష నిర్వహించిందని, వారు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. గత ఏడాది ఈ నోటిఫికేషన్‌తో పాటు డిగ్రీ, జూనియర్‌ కాలేజీ లెక్చరర్లు, లెబ్రేరియన్‌లు, ఫిజికల్‌ డైరెక్టర్స్‌, పీజీటీ, టీజీటీ, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌, ఆర్ట్స్‌ అన్నింటికీ కలిపి 9 నోటిఫికేషన్‌లు జారీ అయ్యాయని, అన్నింటిలోనూ ప్రశ్న పత్రాలు ఆంగ్లంలోనే ఉన్నాయన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి టీఆర్‌ఈఐఆర్‌బీ తాను విడుదల చేసిన నోటిఫికేషన్‌కు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని తెలిపారు. పిటిషనర్లు పరీక్ష అయిన వెంటనే కోర్టును ఆశ్రయించారని, అందుకే ఫలితాలను విడుదల చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. ఈ మేరకు గురుకులాల్లో ఆర్ట్స్‌ టీచర్‌ పోస్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని, ప్రశ్నపత్రం రెండు భాషల్లోనూ ఇవ్వాలని టీఆర్‌ఈఐఆర్‌బీని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని