రైతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించం

ధాన్యానికి కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. రైతులకు నష్టం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

Published : 13 Apr 2024 06:03 IST

ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాల్సిందే
తక్కువకు కొంటే మిల్లుల్ని బ్లాక్‌ లిస్టులో పెట్టండి
వ్యాపారుల ట్రేడ్‌ లైసెన్సులు రద్దు చేయండి
ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రానీయొద్దు
సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

ధాన్యానికి కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. రైతులకు నష్టం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారుల ట్రేడ్‌ లైసెన్సులను రద్దు చేయాలని, మిల్లర్లకు కస్టమ్‌ మిల్లింగ్‌ నిలిపివేసి ఆ మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం శుక్రవారమిక్కడ సమీక్షించారు. కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా, కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. కొనుగోళ్ల ప్రక్రియను రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, జిల్లాల్లో కలెక్టర్లు ఏ రోజుకారోజు సమీక్షించాలని చెప్పారు.

గతేడాది కంటే ముందే..

ధాన్యం కొనుగోళ్లు, తెరిచిన కొనుగోలు కేంద్రాలపై పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ‘శుక్రవారం నాటికి 6,808 కేంద్రాలు తెరిచాం. 1.51 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం. గతేడాది ఇదే తేదీ నాటికి ఏర్పాటు చేసిన కేంద్రాలు 191. కొనుగోలు చేసిన ధాన్యం ఏమీలేదు’ అని వివరించారు. ఈ సందర్భంగా చౌహాన్‌ని సీఎం అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ- ఎన్నికల సమయం కావడంతో కొన్నిచోట్ల రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశపూర్వక కథనాలు వస్తున్నాయని.. అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు.

ఆరబెట్టాలని రైతులకు సూచన

‘ధాన్యంలో తేమ శాతం ఎక్కువుందని కొన్నిచోట్ల వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.మార్కెట్‌ యార్డులకు తెచ్చేముందే ధాన్యాన్ని ఆరబెట్టాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు సూచించారు. ‘నేరుగా కల్లాల నుంచి వడ్లను మార్కెట్లకు తీసుకెళ్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఒకట్రెండు రోజులు ఆరబెట్టి మంచి రేటు పొందండి’ అని ఉద్బోధించారు. ఆరబెట్టేందుకు మార్కెట్‌ యార్డుల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, వడ్ల దొంగతనం జరగకుండా సీసీ కెమెరాలు పెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. వడగండ్ల వానలు వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని మార్కెట్‌ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ- మద్దతు ధర కంటే ఒక్క రూపాయి తక్కువకు ఎవరు కొనుగోలు చేసినా చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. ‘రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాల్లో ఇంకా ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలి’ అని సూచించారు.

సాగర్‌ డెడ్‌ స్టోరేజీ నుంచైనా హైదరాబాద్‌కు నీరు

పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, పెరుగుతున్న ఎండల దృష్ట్యా రానున్న రెండు నెలలు మరింత కీలకమని అధికారుల్ని ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. ‘గతేడాది కంటే అధికంగా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవట్లేదు. భూగర్భ జలమట్టం పడిపోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తింది’ అని వివరించారు. ‘ఎక్కడైనా ఫిర్యాదు వస్తే అక్కడ తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో మిషన్‌ భగీరథ, మున్సిపల్‌, ఇరిగేషన్‌, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలి. ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు తాగునీటి ఇబ్బందులున్న చోటుకు వెళ్లి పరిశీలించాలి’ అని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు మరింత డిమాండ్‌ పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. అవసరమైతే నాగార్జునసాగర్‌ డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్‌కు తీసుకురావాలని.. అందుకు వెంటనే ఏర్పాట్లు  చేయాలని ఆదేశించారు. మరోవైపు సింగూర్‌ నుంచీ నీటి సరఫరాకు సన్నద్ధంగా ఉండాలన్నారు.

కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు

కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సీఎం అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచి పోయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఉద్దేశ పూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కావాలని ప్రభుత్వానికి చెడ్డపేరు  తెచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని