మే 3 నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Updated : 15 Apr 2024 05:42 IST

వయోవృద్ధులు, దివ్యాంగులు, ఎన్నికల సిబ్బందికి అవకాశం
ఆరు రోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు, కేంద్ర సర్వీసుల్లో పని చేసే సిబ్బంది, దివ్యాంగులు, 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అవకాశం ఎంచుకున్న దివ్యాంగులు, వయోవృద్ధులు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రెండో దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ కేంద్రంలో ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. మే 3న ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఎనిమిదో తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది. సాధారణ పోలింగ్‌ తేదీ కన్నా నాలుగు రోజుల ముందుగానే ఇది పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి  పోస్టల్‌ బ్యాలెట్‌ ముద్రణ మొదలుపెట్టి వచ్చే నెల రెండో తేదీలోగా పూర్తి చేయనున్నారు. ఈవీఎం యంత్రాలపైన ఉంచే బ్యాలెట్‌ పత్రాలను హైదరాబాద్‌లోనే ముద్రించాలని అధికారులు నిర్ణయించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను ఆయా జిల్లాల్లోనే ముద్రించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

13 లక్షల పత్రాల ముద్రణ

లోక్‌సభ ఎన్నికలకు సుమారు 13 లక్షల పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను ముద్రించాలని అధికారులు నిర్ణయించారు. 85 సంవత్సరాలు దాటిన వారు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 4.50 లక్షల మంది ఉన్నట్లు అంచనా. దివ్యాంగ ఓటర్లు సుమారు 5 లక్షల మంది నమోదయ్యారు. ఎన్నికల విధుల్లో సుమారు 2.60 లక్షల మంది ఉద్యోగులు భాగస్వాములు కానున్నారు. రాష్ట్రానికి చెందిన 15 వేల మందికిపైగా సిబ్బంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారికి రిజిస్టర్‌ పోస్టు ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ పంపుతారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దివ్యాంగులు, వయోవృద్ధులు 12డీ దరఖాస్తు ఫారం నింపి రిటర్నింగ్‌ అధికారికి అందించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని