రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!

ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్‌, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది.

Published : 18 Apr 2024 03:37 IST

కార్యాచరణకు సిద్ధమవుతున్న ఆర్టీసీ
డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఏసీ బస్సులపై ప్రత్యేక దృష్టి
జూన్‌ నుంచి సంస్థపై వేతన సవరణ భారం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్‌, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. ఈ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను మరింతగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కార్మికులు, ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం మార్చిలో వేతన సవరణ చేసింది. పెరిగిన వేతనాలు జూన్‌ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ వేతన సవరణతో సంస్థపై ఏటా రూ.418 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ భారాన్ని తట్టుకునేందుకు వీలుగా టికెట్‌ ఆదాయాన్ని రోజుకు రూ.కోటి పెంచుకోవాలని సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా ఏడాదికి  రూ.365 కోట్ల అదనపు ఆదాయం రాబట్టుకోవాలని భావిస్తోంది.

డిమాండ్‌ ఉన్న రూట్లలో అదనపు సర్వీసులు!

ఆర్టీసీలో గరిష్ఠంగా రోజుకు 55 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి (ఆక్యుపెన్సీ రేషియో- ఓఆర్‌)  95-120 శాతం వరకు నమోదవుతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం లేని డీలక్స్‌, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఓఆర్‌ 65-70 శాతం వరకు ఉంటున్నట్లు సమాచారం. ఈ బస్సుల్లోనూ ఓఆర్‌ శాతం పెంచుకోగలిగితే ఆదాయం పెరుగుతుందని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం రూట్ల వారీగా అదనపు ఆదాయానికి ఉన్న అవకాశాల్ని గుర్తించడం, ఆర్టీసీ బస్టాండ్ల దగ్గర ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఆగకుండా చూడటం, డిమాండ్‌ ఉన్న రూట్లలో డీలక్స్‌, సూపర్‌లగ్జరీ, ఏసీ సర్వీసుల్ని అధికంగా నడపడం వంటి చర్యలుచేపట్టనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌-శ్రీశైలం మధ్య గతంలో సూపర్‌లగ్జరీ బస్సులు మాత్రమే ఉండేవి. ఇటీవల ఏసీ బస్సుల్ని సంస్థ ప్రవేశపెట్టింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణికులకు కొత్త సౌకర్యంతో పాటు సంస్థకు ఆదాయం పెరిగింది. ఇదే తరహా ప్రయోగాల్ని మరికొన్ని రూట్లలో చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది.

కండక్టర్లు, డ్రైవర్లతో సమావేశాలు..

ఆర్టీసీ యాజమాన్యం ఇటీవల నిర్వహించిన సమావేశంలో.. వేతన సవరణ అదనపు భారాన్ని ఎలా భరించాలన్న అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. డీలక్స్‌, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సుల్లో ప్రయాణికులను పెంచుకుంటే.. రోజుకు రూ.కోటి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ ఎండీ సూచించారు. ఈ దిశగా సమాయత్తం చేసేందుకు డిపోలవారీగా డీలక్స్‌, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సుల కండక్టర్లు, డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని