సాగర్‌లో అత్యవసర మోటార్ల ట్రయల్‌ రన్‌ ప్రారంభం

హైదరాబాద్‌ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్‌ జలాశయంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్‌ రన్‌) బుధవారం ప్రారంభమైంది.

Published : 18 Apr 2024 03:46 IST

పెద్దఅడిశర్లపల్లి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్‌ జలాశయంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్‌ రన్‌) బుధవారం ప్రారంభమైంది. నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం ఏఎమ్మార్‌ ప్రాజెక్టు నుంచి కోదండాపురం మెట్రో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ద్వారా జంట నగరాలకు 270 ఎంజీడీల నీటిని నిత్యం సరఫరా చేస్తుంటారు. వేసవిలో నాగార్జునసాగర్‌ నీటిమట్టం డెడ్‌స్టోరేజ్‌ దిగువకు పడిపోవడంతో జలమండలి అధికారులు వారం క్రితం జలాశయం జీరో పాయింట్‌ వద్ద యుద్ధప్రాతిపాదికన అత్యవసర మోటార్ల ఏర్పాటు పనులు ప్రారంభించారు. 120 క్యూసెక్కుల సామర్థ్యం కలిగినవి 5, 60 క్యూసెక్కుల సామర్థ్యం కలిగినవి 5 మొత్తం 10 మోటార్లతో 900 క్యూసెక్కుల నీటిని ఏఎమ్మార్పీ అప్రోచ్‌ కెనాల్‌కు విడుదల చేయాలి. మంగళవారం సాయంత్రం విద్యుదీకరణ పూర్తవడంతో వీటిలో ముందుగా 60 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్లను అధికారులు బుధవారం ప్రయోగాత్మకంగా పరిశీలించారు. వీటిద్వారా 240 క్యూసెక్కుల నీటిని అప్రోచ్‌ కెనాల్‌లోకి విడుదల చేస్తున్నట్లు జలమండలి డీజీఎం వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మరో మూడు రోజుల్లో మిగిలిన మోటార్ల పనులు సైతం పూర్తిచేసి సాగర్‌ నుంచి నిర్ణీత మొత్తం 900 క్యూసెక్కుల నీటిని ఏఎమ్మార్‌ ప్రాజెక్టుకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని