ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు

మల్టీజోన్‌-1 పరిధిలో ఆరుగురు పోలీస్‌ అధికారులను సస్పెండ్‌ చేస్తూ ఐజీ ఎ.వి.రంగనాథ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 19 Apr 2024 04:04 IST

మల్టీజోన్‌-1 ఐజీ ఎ.వి.రంగనాథ్‌ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: మల్టీజోన్‌-1 పరిధిలో ఆరుగురు పోలీస్‌ అధికారులను సస్పెండ్‌ చేస్తూ ఐజీ ఎ.వి.రంగనాథ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, ఒక కానిస్టేబుల్‌ ఉన్నారు. అక్రమాలకు పాల్పడటంతో పాటు విధుల్లో అలసత్వం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

  • బోధన్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.డి.ప్రేమ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. హైదరాబాద్‌ పంజాగుట్ట ఠాణా పరిధిలోని ప్రజాభవన్‌ వద్ద జరిగిన రోడ్డుప్రమాదానికి కారకుడైన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ను తప్పించేందుకు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌తో ప్రేమ్‌కుమార్‌ సంప్రదింపులు జరిపినట్లుగా విచారణలో తేలడంతో సస్పెన్షన్‌ వేటు వేశారు.
  • నిజామాబాద్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రమేశ్‌ మద్యం సేవించి పోలీస్‌స్టేషన్‌కు రావడమే కాకుండా ఠాణా సిబ్బందిని ఇబ్బందులకు గురి చేసినట్లు ఏసీపీ విచారణలో తేలడంతో సస్పెండ్‌ చేశారు.
  • జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ ఠాణా పరిధిలో నమోదైన గంజాయి కేసు దర్యాప్తులో అలసత్వంగా వ్యవహరించినందుకు ఎస్సైలు జి.మనోహర్‌రావు, ఎ.తిరుపతి, హెడ్‌కానిస్టేబుల్‌ బి.రవీందర్‌రెడ్డి, కానిస్టేబుల్‌ టి.నరేందర్‌ను సస్పెండ్‌ చేశారు. జగిత్యాల ఎస్పీ అందించిన విచారణ నివేదిక ఆధారంగా సస్పెన్షన్‌ వేటు వేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని