చర్లపల్లి జైలు ఖైదీ కడుపులో తొమ్మిది మేకులు!

ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ రిమాండ్‌ ఖైదీకి గాంధీ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించి కాపాడారు.

Published : 21 Apr 2024 05:39 IST

తొలగించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ రిమాండ్‌ ఖైదీకి గాంధీ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించి కాపాడారు. ఎండోస్కోపీ ద్వారా తొమ్మిది పొడవాటి మేకులను బయటకు తీసి పునర్జన్మ ప్రసాదించారు. చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మహ్మద్‌ షేక్‌ (32)కు నాలుగు రోజుల క్రితం హఠాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో జైలు వైద్యుల సిఫార్సు మేరకు అతడిని గాంధీ ఆసుపత్రి ఖైదీల వార్డులో చేర్పించారు. డాక్టర్లు  ఎక్స్‌రేలు తీయించి పరిశీలించగా ఖైదీ కడుపులో కొన్ని ఇనుప మేకులు ఉన్నట్లు తేలింది. గ్యాస్టో ఎంటరాలజీ విభాగాధిపతి శ్రవణ్‌కుమార్‌ నేతృత్వంలో శనివారం మళ్లీ వైద్యపరీక్షలు చేశారు. రోగి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి ఎండోస్కోపీ ద్వారా తొమ్మిది మేకులను విజయవంతంగా బయటకు తీశారు. సుమారు 2 -2.5 అంగుళాలు ఉండే ఈ మేకులను రోగి కావాలనే మింగాడని.. అందుకు కారణాలేమిటో ఆరా తీస్తున్నామని జైలు వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని