ఫస్టియర్‌లో 60.01%.. సెకండియర్‌లో 64.19%

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్‌ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు.

Published : 25 Apr 2024 05:07 IST

ఫలితాలు విడుదల చేసిన బోర్డు
రెండు సంవత్సరాల్లోనూ బాలికలదే పైచేయి
నేటి నుంచి రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ దరఖాస్తులు
మే 24 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్‌ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజాలు బుధవారం ఇంటర్‌ విద్యామండలికార్యాలయంలో విడుదల చేశారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో రంగారెడ్డి (71.7 శాతం), మేడ్చల్‌ (71.58 శాతం), ములుగు (70.01 శాతం) జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. రెండో సంవత్సరం ఫలితాల్లో ములుగు (82.95 శాతం), మేడ్చల్‌ (79.31 శాతం), రంగారెడ్డి (77.63 శాతం) జిల్లాలు తొలి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. మొత్తంగా ఈ మూడు జిల్లాలే తొలి మూడు స్థానాల్లో నిలవడం విశేషం.

బాలికల సత్తా...

  • మొదటి సంవత్సరం పరీక్షలకు 4.78 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. 2.87 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరం పరీక్షలకు 5.02 లక్షల మంది హాజరవగా.. 3.22 లక్షల మంది పాసయ్యారు. రెండు సంవత్సరాలు కలిపి 9,80,978 మంది పరీక్షలు రాయగా.. 6.09 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. 3.71 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు.
  • ఫలితాల్లో బాలికలు మరోసారి పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో బాలికలు 68.35% మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలుర కేటగిరీలో 51.5% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరం బాలికలు 72.53% మంది, బాలురు 56.1% మంది ఉత్తీర్ణత సాధించారు.
  • రెగ్యులర్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరంలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం తగ్గగా... రెండో సంవత్సరంలో మాత్రం పెరిగింది.
  • ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలతో పోలిస్తే గురుకులాలు, కేజీబీవీలు, మోడల్‌ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాలు మెరుగ్గా ఉన్నాయి.

ఒకేషనల్‌ కోర్సుల్లో..

ఇంటర్‌ ఒకేషనల్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను 48,310 మందికి. 24,432 మంది (50.57%) ఉత్తీర్ణులయ్యారు.రెండో సంవత్సరంలో 46,607 మంది విద్యార్థులకు గాను 28,836 మంది (51.87%) ఉత్తీర్ణత సాధించారు.  

రీ కౌంటింగ్‌, రీ వాల్యుయేషన్‌కు..

  • రీ కౌంటింగ్‌, రీ వాల్యుయేషన్‌కు ఈ నెల 25 నుంచి మే 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఇందుకోసం ప్రతి పేపర్‌కు రూ.600 రుసుము చెల్లించాలని సూచించింది.
  • అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు బోర్డు షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభమవుతాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలు రాసేవారు ఏప్రిల్‌ 25 నుంచి మే 5 వరకు ఫీజు చెల్లించవచ్చు.

సందేహాలుంటే..

ఫలితాలపై సందేహాలుంటే helpdeskie@telangana.gov.in కి మెయిల్‌ చేయవచ్చు. 040-24655027 నంబర్‌కు కాల్‌ చేయవచ్చు. ఉత్తీర్ణులు కాని, తక్కువ మార్కులు వచ్చాయని బాధపడే వారికి టెలీమానస్‌తో సలహాలు అందిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు