బొగ్గు తరలింపుపై ప్రతిష్టంభన

సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వర్షాకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది.

Published : 19 May 2024 05:12 IST

సింగరేణిలో లారీ కిరాయిల భారం...
విద్యుత్కేంద్రాలకు బొగ్గు పంపాలన్న కేంద్రం ఆదేశాల అమలుకూ విఘాతం

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వర్షాకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. రెండేళ్లుగా దేశంలో వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి, సరఫరా తగినంత లేక విద్యుదుత్పత్తి కేంద్రాలు ఇబ్బంది పడ్డాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా దేశంలోని అన్ని గనుల నుంచి అత్యవసరంగా విద్యుదుత్పత్తి కేంద్రాలకు బొగ్గు తరలించాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడానికి సింగరేణి ఇబ్బందులు పడుతోంది. ఉదాహరణకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి గనుల వద్ద 10 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఈ గనుల తవ్వకం ప్రారంభించినప్పుడు ఇక్కడ ఉత్పత్తయ్యే బొగ్గులో 40 శాతం నిర్వాసితులు, స్థానికుల వాహనాల ద్వారా తరలిస్తామని సింగరేణి తెలిపింది. ఈ నిబంధన వల్ల ప్రస్తుతం రోజుకు సగటున 10 వేల టన్నులకు పైగా స్థానిక లారీల యజమానులు పలు ప్రైవేటు పరిశ్రమలకు రవాణా చేస్తున్నారు. కానీ ఇప్పుడు బొగ్గు తొలుత విద్యుదుత్పత్తి కేంద్రాలకు తరలించాలని కేంద్రం ఆదేశించడంతో స్థానికుల లారీల ద్వారా రవాణాను సింగరేణి నిలిపివేసింది. ఎందుకంటే గనుల నుంచి రుద్రంపూర్‌లో గల రైల్వే కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటుకు బొగ్గు పంపడానికి టిప్పర్లు అవసరం. కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌కు చేర్చితేనే అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలలోని విద్యుదుత్పత్తి కేంద్రాలకు గూడ్స్‌ రైళ్ల ద్వారా బొగ్గును పంపడానికి వీలవుతుంది. టిప్పర్ల నుంచి నేరుగా గూడ్స్‌ వ్యాగన్లలో ఎత్తిపోయవచ్చు. అయితే సత్తుపల్లి స్థానికులకు టిప్పర్లు లేకపోవడంతో సంస్థ.. వారి లారీల ద్వారా రవాణాను నిలిపివేసింది. దీనిపై లారీల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో ప్రాంతంలో చూస్తే... గని నుంచి బొగ్గు తరలించడానికి సింగరేణి లారీల కిరాయి నిర్ణయించడానికి టెండర్లు పిలిచింది. కిలోమీటరుకు రూ.3.29 చొప్పున చెల్లిస్తే తరలిస్తామని ఒక వ్యాపారి టెండరు వేయగా సంస్థ ఆమోదించింది. ఇదే ధరకు తరలించడానికి స్థానిక లారీల యజమానులకు కూడా అవకాశం ఇవ్వడానికి ఆ వ్యాపారి ముందుకొచ్చారు. కానీ గతంలో కిలోమీటరుకు రూ.4.20 చొప్పున చెల్లించారని ఇప్పుడు తగ్గిస్తే ఒప్పుకొనేది లేదని లారీల యజమానులు స్పష్టం చేస్తున్నారు. రోజుకు 2 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి చేసే సింగరేణి గనుల నుంచి బొగ్గు తరలించడానికి లక్ష ట్రిప్పుల వరకూ టిప్పర్లు, లారీలు కావాలి. సాధారణ రోజుల్లోనూ మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ గనుల నుంచి హైదరాబాద్‌కు లారీలో తెచ్చే బొగ్గుకు టన్నుకు రూ.1,500 దాకా చెల్లిస్తుంటే... అంతకన్నా వంద కిలోమీటర్ల తక్కువ దూరంలో ఉన్న సింగరేణి గనుల నుంచి తీసుకురావాలంటే రూ.2 వేల దాకా వసూలు చేస్తున్నారని సిమెంట్‌ తదితర పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కిరాయి ఛార్జీలను ప్రైవేటు లారీలు వసూలు చేస్తున్నందున వాటిపై తమకు నియంత్రణ లేదని సింగరేణి సంస్థ చెపుతోంది.

అక్కడ డ్రైవర్లకు వేతనాలు తక్కువ: లారీల యజమాన్యాలు

‘మహారాష్ట్ర, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల్లో లారీ డ్రైవర్లకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. తెలంగాణలో అధికంగా ఇవ్వకపోతే డ్రైవర్లు రావడం లేదు. అందువల్ల ఇక్కడ కిరాయి ఎక్కువగా వసూలు చేయాల్సి వస్తోంది’ అని లారీల యజమాన్యాలు పేర్కొంటున్నాయి. సత్తుపల్లిలో లారీల వివాదంపై స్థానిక లారీల యజమానుల సంఘం అధ్యక్షుడు కొండపల్లి రమేశ్‌రెడ్డిని ‘ఈనాడు’ వివరణ కోరగా.. ‘సింగరేణిలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ కిరాయిలు తక్కువగా వసూలు చేస్తున్నాం. సంస్థ నాసిరకం బొగ్గు ఇవ్వడంతో పరిశ్రమల నుంచి ఆర్డర్లు రావడం లేదు. గనులపై ఆధారపడి జీవిస్తున్న లారీ యజమానులకు, కార్మికులకు సంస్థ న్యాయం చేయాలి. తాజా పరిస్థితులపై సింగరేణి సీఎండీ బలరాంను వివరణ అడగ్గా విద్యుదుత్పత్తి కేంద్రాలకు అత్యవసరంగా బొగ్గు తరలించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చినందున రైళ్ల ద్వారా పంపుతున్నట్లు తెలిపారు. లారీల కిరాయిల అంశంపై విచారణ చేయిస్తున్నట్లు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని