శ్రీవారి వీఐపీ బ్రేక్‌ టికెట్ల జారీ పునఃప్రారంభం

ఎన్నికల కోడ్‌ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తిరిగి వీఐపీల సిఫారసుపై బ్రేక్‌ టికెట్ల జారీకి అనుమతించాలన్న తితిదే విజ్ఞప్తికి రాష్ట్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Published : 21 May 2024 04:23 IST

సిఫార్సు లేఖలు స్వీకరిస్తున్న తితిదే

తిరుమల, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తిరిగి వీఐపీల సిఫారసుపై బ్రేక్‌ టికెట్ల జారీకి అనుమతించాలన్న తితిదే విజ్ఞప్తికి రాష్ట్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. బోర్డు సభ్యులకు గతంలో మాదిరిగానే రోజుకు పది వీఐపీ బ్రేక్, పది రూ.300 ఎస్‌ఈడీ టికెట్లు, ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్‌ టికెట్లను సిఫారసు లేఖలపై జారీ చేస్తున్నారు. బోర్డు సభ్యులకు ఇప్పటికే ‘డిజిటల్‌ కీ’లను ఇచ్చిన నేపథ్యంలో వారు నేరుగా తమ టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేయొచ్చు. వాటిని పొందినవారు ఎంబీసీలో నగదు చెల్లించి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మూడు రోజులుగా శ్రీవారి దర్శనానికి 24 గంటలకుపైగా సమయం పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటితరుణంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు పునరుద్ధరించడం కోసం తితిదే ఉన్నతాధికారులు యత్నించడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

శ్రీవారి దర్శనానికి 16 గంటలు

సర్వదర్శనానికి భక్తుల రద్దీ సోమవారం సాయంత్రానికి కొంత తగ్గింది. మూడు రోజులుగా వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు.  ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా సోమవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్ల్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి కృష్ణతేజ అతిథి గృహం వరకు వేచి ఉన్నారు. వీరికి దాదాపు 16 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. ఆదివారం శ్రీవారిని 86,721 మంది దర్శించుకున్నారు. రూ.3.87 కోట్ల హుండీ కానుకలు లభించాయి. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని