కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 27కు వాయిదా

దిల్లీ మద్యం విధానం రూపకల్పనలో జరిగిన అవకతవకలపై ఈడీ, సీబీఐలు నమోదుచేసిన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీ హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్లపై విచారణ సోమవారానికి(27వ తేదీకి) వాయిదా పడింది.

Updated : 25 May 2024 05:39 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం విధానం రూపకల్పనలో జరిగిన అవకతవకలపై ఈడీ, సీబీఐలు నమోదుచేసిన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీ హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్లపై విచారణ సోమవారానికి(27వ తేదీకి) వాయిదా పడింది. శుక్రవారం ఈ కేసులపై విచారణ జరిపిన జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం సమయాభావం కారణంగా వాదనలను సోమవారానికి వాయిదా వేసింది. శుక్రవారం విచారణ సందర్భంగా కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌధరి వాదనలు వినిపిస్తూ.. ఆమె అరెస్టు విషయంలో దర్యాప్తు సంస్థలు రెండూ నిబంధనలు ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని సవాల్‌చేస్తూ ఆర్టికల్‌ 32 కింద తాము సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశామని, ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీచేసి విచారణను జులైకి వాయిదా వేసిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు చెప్పిన మీదట  బెయిల్‌ కోసం తాము పిటిషన్లు దాఖలు చేసినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. 2022 ఆగస్టు 17న సీబీఐ కేసు నమోదు చేసినప్పుడుకానీ, అదే నెల 22న ఈడీ కేసు నమోదుచేసినప్పుడుకానీ కవితను నిందితురాలుగాకానీ, అనుమానితురాలుగాకానీ పేర్కొనలేదని గుర్తుచేశారు. అయితే, ఇండోస్పిరిట్‌ సంస్థలో వాటా కోసం డబ్బు సమకూర్చాలని కవిత చెప్పడంతో శ్రీనివాసరావు అనే వ్యక్తి తనకు కోటి రూపాయలు ఇచ్చినట్లు అరుణ్‌పిళ్లై వాంగ్మూలం ఇచ్చారని, దాని ఆధారంగానే కవిత పేరు తెరమీదికొచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత అరుణ్‌పిళ్లై ఆ వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు.

కవిత అరెస్టు విషయంలో ఈడీ నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 ప్రకారం విచారణ కోసం మహిళలను దర్యాప్తు సంస్థల కార్యాలయాలకు పిలవకూడదని, ఆ విషయాన్ని తాము గుర్తుచేసినా వినకుండా దిల్లీలోని కార్యాలయానికి పిలిపించి విచారించారని తెలిపారు. అయితే, కవిత తరఫు న్యాయవాది వాదనలు కొనసాగించడానికి కోర్టు సమయం లేకపోవడంతో న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ విచారణను సోమవారానికి వాయిదావేశారు. ఇదే కేసులో జూన్‌ 7వ తేదీకల్లా కవిత పాత్రపై ఛార్జిషీట్‌ దాఖలుచేయనున్నట్లు సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే బెయిల్‌ కోసం ఆమె దాఖలుచేసిన పిటిషన్‌పై తమ సమాధానాన్ని సోమవారానికల్లా దాఖలుచేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్‌ కోసం కవిత దాఖలుచేసిన పిటిషన్లపై సోమ, మంగళవారాల్లో వాదనలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత న్యాయమూర్తి తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని