అడవుల్లో మందుపాతరలు పెట్టొద్దు

అడవుల్లో మావోయిస్టులు మందుపాతరలను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన గిరిజనులు భారీ ప్రదర్శన నిర్వహించారు.

Published : 06 Jun 2024 05:00 IST

మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనుల భారీ ప్రదర్శన

జగన్నాథపురం జాతీయ రహదారిపై గిరిజనుల ప్రదర్శన 

వాజేడు, న్యూస్‌టుడే: అడవుల్లో మావోయిస్టులు మందుపాతరలను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన గిరిజనులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నామని చెబుతున్న మావోయిస్టులు  మందుపాతరలతో ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంగాల అటవీ ప్రాంతంలోని గుట్టపై మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇల్లెందుల ఏసు(55) సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. వాజేడు, వెంకటాపురం మండలాల నుంచి భారీగా గిరిజనులు తరలివచ్చి ఏసు కుటుంబానికి మద్దతుగా నిలిచి జాతీయ రహదారిపై ప్రదర్శన చేపట్టారు. దీంతో రెండువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ పనులు చేసే ప్రదేశంలో మందుపాతరలు పెడితే ఎలా బతకాలని వాపోయారు. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరుగుతున్న పోరులో తమ ఇంటి పెద్దదిక్కులను కోల్పోతున్నామంటూ విలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని