కొత్తగూడెం థర్మల్‌ స్టేషన్‌ కాలుష్యంపై నివేదికివ్వండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ వెదజల్లుతున్న కాలుష్యం తాజా పరిస్థితిపై మూడు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 09 Jun 2024 04:23 IST

కాలుష్య నియంత్రణ మండలికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ వెదజల్లుతున్న కాలుష్యం తాజా పరిస్థితిపై మూడు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నుంచి బూడిద, ఇతర కాలుష్య కారకాలు కర్కవాగు, కిన్నెరసాని నదుల్లో కలుస్తున్నా పీసీబీ అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన దాసరి రమేశ్‌కుమార్, మరొకరు 2017లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మరోసారి విచారణ చేపట్టింది. 2022లో పీసీబీ అధికారులు సమర్పించిన నివేదికలో థర్మల్‌ స్టేషన్‌కు చెందిన అవక్షేపాల నిల్వకు ప్రత్యేకంగా ట్యాంకు ఏర్పాటు చేయలేదని, వర్షాకాలంలో వృథా నీటిని కూడా వదిలివేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నివేదికకు సంబంధించి తీసుకున్న చర్యలపై ఎలాంటి అఫిడవిట్‌ దాఖలు చేయకపోవడంతో పీసీబీ అధికారులు మరోసారి థర్మల్‌ స్టేషన్‌ను సందర్శించి మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని