Yasangi Crops: యాసంగి.. యాతన

పంటలు వేసిన మొదట్లో సాగునీటి కొరతతో కష్టాలు పడిన యాసంగి రైతులకు.. ప్రస్తుతం కోతల సమయంలో అకాలవర్షాలు శరాఘాతంగా మారాయి.

Updated : 18 May 2024 03:59 IST

ఏటా అకాల వర్షాలు, వడగళ్లతో పంటలకు అపార నష్టం
పూర్తిస్థాయిలో అందని పరిహారంతో అన్నదాతల అగచాట్లు
ఈనాడు - హైదరాబాద్‌

గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం
తాడిచెర్లలోని కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం

పంటలు వేసిన మొదట్లో సాగునీటి కొరతతో కష్టాలు పడిన యాసంగి రైతులకు.. ప్రస్తుతం కోతల సమయంలో అకాలవర్షాలు శరాఘాతంగా మారాయి. మధ్యలో మార్చిలోనూ వడగళ్ల వానలతో కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుత మండు వేసవిలో ఈదురుగాలులు, భారీ వర్షాలు అన్నదాతల వెన్నువిరుస్తున్నాయి.

కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి 

సాధారణంగా నవంబరు నుంచి మే వరకు యాసంగి కొనసాగుతుంది. ఈ సమయంలో వర్షాలు ఉండవనే నమ్మకంతో వరితోపాటు అపరాలు, వాణిజ్య పంటల సాగుకు రైతులు ప్రాధాన్యమిస్తారు. 90 నుంచి 110 రోజుల్లో దిగుబడులు వస్తాయి. అయితే వాతావరణ మార్పులు రైతుల ఆశలకు గండి కొడుతున్నాయి. అకాల వర్షాలు, వడగళ్లతో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మామిడికాయలు రాలిపోతున్నాయి. కొన్నేళ్లుగా ఈ నష్టాలు ఆనవాయితీగా మారాయి. పంట నష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిర్వహణ నిధుల నుంచి సాయం అందించాలి. అకాల వర్షాల విషయంలో మాత్రం సరిగా అందడం లేదు. వ్యవసాయశాఖ నిబంధనలు కూడా అసంబద్ధంగా ఉంటున్నాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఒక రైతుకు సంబంధించి మూడో వంతు కంటే ఎక్కువ పంట నష్టం జరిగితేనే సాయం పొందేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆలోపు నష్టపోయిన వారికి ఎలాంటి సాయం అందడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం పంటల బీమా పథకాలేవీ అమల్లో లేవు. ప్రకృతి వైపరీత్యాల కింద కేంద్రం నుంచి సాయం అందాల్సి ఉన్నా రావడం లేదు. గత అయిదేళ్లుగా భారీ నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపుతున్నా.. సాయం మాత్రం రాలేదు. గత ఏడాది మార్చి నెలలో జరిగిన నష్టానికిగాను తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులను ఎకరానికి రూ.10 వేలు చొప్పున చెల్లిస్తామని ప్రకటించి అందించింది. ఆ తర్వాత అదే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో మరో రెండుసార్లు వర్షాలు పడగా ప్రభుత్వం సాయం ప్రకటించింది. జీవో కూడా ఇచ్చినప్పటికీ సాయం అందలేదు. ఈ ఏడాది మార్చి  16-22 తేదీల మధ్య కురిసిన అకాల వర్షానికి సంబంధించి జరిగిన నష్టానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 15.81 కోట్లు విడుదల చేయడం కాస్త ఊరటనిచ్చే అంశం.

నెల ముందుగానే.. 

ఏటా సంభవిస్తున్న అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్ర నష్టం కలుగుతుండటంపై ప్రభుత్వ స్థాయిలో విస్తృత చర్చలు జరిగాయి. యాసంగి సీజన్‌ను నెల రోజులు ముందుకు జరపాలనే ప్రతిపాదనను పరిశీలించింది. అక్టోబరులో ప్రారంభించి ఫిబ్రవరి లేదా మార్చిలో ముగించాలని యోచించింది. ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ఈ విధానం నడుస్తోంది. అదే తరహాలో రాష్ట్రమంతటా అమలు చేయాలని భావించినా గతేడాది వర్షాభావ పరిస్థితులతో ఈ ప్రతిపాదన అమలు కాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చే సీజన్‌ నుంచి రైతుబీమా అమలు చేస్తామని ప్రకటించింది. దీనికి విధివిధానాలు కూడా సిద్ధం చేస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే రైతులకు కొంత ఊరట కలిగే వీలుంది.


కష్టమంతా వర్షార్పణం

వీరిద్దరూ హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సింపన్న రమేష్‌ దంపతులు. స్థానికంగా రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యమంతా తడిసిపోయింది. కొంతైనా కాపాడుకుందామనే తాపత్రయంతో ఇలా ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు