Judicial Commission: టెండర్లు పిలవకుండా పనులు ఎలా కేటాయించారు?

కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానం పాటించకుండా.. టెండర్లు పిలవకుండా.. నిర్మాణం, కొనుగోళ్ల వల్ల ఆర్థికభారం అధికమై ప్రజాధనం వృథా కాదా? అని యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్‌ నరసింహారెడ్డి జ్యుడిషియల్‌ కమిషన్‌ అధికారులను నిలదీసింది.

Updated : 11 Jun 2024 13:09 IST

కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానం ఎందుకు పాటించలేదు!
ప్రజాధనం వృథా కాదా?
అధికారులను ప్రశ్నించిన జ్యుడిషియల్‌ కమిషన్
యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం.. ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలుపై విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానం పాటించకుండా.. టెండర్లు పిలవకుండా.. నిర్మాణం, కొనుగోళ్ల వల్ల ఆర్థికభారం అధికమై ప్రజాధనం వృథా కాదా? అని యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్‌ నరసింహారెడ్డి జ్యుడిషియల్‌ కమిషన్‌ అధికారులను నిలదీసింది. ఈ మేరకు కమిషన్‌ సోమవారం విచారణ జరిపింది. గత భారాస ప్రభుత్వ హయాంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సురేష్‌ చందా, అప్పటి జెన్‌కో-ట్రాన్స్‌కోల సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావులను కమిషన్‌ కార్యాలయానికి పిలిపించి వివిధ కీలకాంశాలపై ప్రశ్నించింది. యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణానికి అసలు టెండర్లు పిలవకుండా.. ఒప్పందం చేసుకుని నేరుగా బీహెచ్‌ఈఎల్‌(భెల్‌)కు కేటాయించాల్సిన అవసరం ఏమిటని కమిషన్‌ ప్రశ్నించింది. ప్రభుత్వం చేపట్టే ఏ ప్రాజెక్టు అయినా కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానంలో టెండర్లు పిలిచి, తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకొచ్చే సంస్థకే కేటాయించాలనే నిబంధనలుంటే వాటిని ఎందుకు అతిక్రమించారని నిలదీసింది. భెల్‌ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయినంత మాత్రాన తక్కువ ధరకు చేస్తుందా.. లేదా.. అనేది టెండర్లు పిలిస్తేనే కదా తెలిసేది? ఆ విషయాన్ని పట్టించుకోకుండా కేటాయించడం వల్ల ఆర్థికభారం అదనంగా పడుతుందా.. లేదా.. అనేది ఎలా తెలుస్తుందని కమిషన్‌ అడిగినట్లు తెలుస్తోంది. మాజీ సీఎండీ ప్రభాకరరావు సమాధానమిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం భెల్‌కు కేటాయించామని, ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారమే కొన్నట్లు వివరించారు. ‘విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)’ ఉంటేనే ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా సాధ్యమని ముందుగా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని జాతీయ విద్యుత్‌ కారిడార్‌ను సరఫరా కోసం తీసుకున్నట్లు ప్రభాకరరావు వివరించారని సమాచారం. దీంతో పీపీఏ చేసుకునే ముందు దేశవ్యాప్తంగా టెండర్లు ఆహ్వానిస్తే తక్కువ ధరకు కరెంటు విక్రయించడానికి ఇతర విద్యుత్‌ కంపెనీలు ముందుకొచ్చేవి కదా అని కమిషన్‌ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో ఎంత తక్కువ ధరకు కరెంటు లభిస్తుందనేది టెండర్లు పిలిస్తేనే తెలుస్తుందని, దానికి అవసరమైన కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానాన్ని పక్కనపెట్టేసి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలపై ఆర్థికభారం పడింది కదా..అని కమిషన్‌ పేర్కొన్నట్లు సమాచారం. 


నేడు, రేపు విచారణ..

తంలో రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులుగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారులు జోషి, అర్వింద్‌కుమార్‌లు మంగళ, బుధవారాల్లో విచారణకు రావాలని కమిషన్‌ నోటీసులు పంపింది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో హడావుడిగా ఒప్పందం చేసుకుని కరెంటు కొంటే దీర్ఘకాలంలో తెలంగాణపై ఆర్థికభారం పడి నష్టపోతామని అర్వింద్‌కుమార్‌ ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడే అప్పటి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. దానిని కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ఈ విషయంపైనా కమిషన్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అర్వింద్‌కుమార్‌ ముందుగా హెచ్చరించినట్లుగానే ఛత్తీస్‌గఢ్‌ కరెంటు వల్ల ఇప్పుడు తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలపై ఆర్థికభారం పడింది. విచారణలో అర్వింద్‌కుమార్‌ ఏం చెబుతారనేది కీలకంగా మారింది. యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయం పెరుగుదలకు కారణాలు, ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలు ఒప్పందానికి ముందు జరిగిన నిర్ణయాలకు సంబంధించిన సమాచారమంతా రాష్ట్ర ఇంధన శాఖ కమిషన్‌కు అందజేసింది. విచారణలో అధికారులు చెబుతున్న సమాధానాలకు అనుగుణంగా మరింత సమాచారాన్ని కమిషన్‌ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని