Telangana inter Board: దిద్దుకోలేని నిర్లక్ష్యం

రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు తమకు వచ్చిన మార్కులు చూసి అవాక్కవుతున్నారు. తమ అంచనా ప్రకారం మార్కులు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.

Updated : 25 May 2024 07:23 IST

ఇంటర్‌ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకుల ఇష్టారాజ్యం
జవాబులు సవ్యంగా రాసినా మార్కులు రాక విద్యార్థుల ఆవేదన
పునఃపరిశీలనకు 48 వేల మంది దరఖాస్తు
మరో 2 వేల మంది రీకౌంటింగ్‌కు విజ్ఞప్తి
ఇంటర్‌ బోర్డుకు ఫిర్యాదుల వెల్లువ

సంహితకు చెందిన ఓఎంఆర్‌ షీట్‌లో వేసిన మార్కుల్లో అనేకచోట్ల దిద్దుబాట్లు. మొత్తం మార్కుల వద్ద 97 వేసి 77గా మార్చిన వైనం..

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు తమకు వచ్చిన మార్కులు చూసి అవాక్కవుతున్నారు. తమ అంచనా ప్రకారం మార్కులు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. జవాబుపత్రాల పునఃపరిశీలన తర్వాత మార్కులను చూసుకున్న విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పేపర్లు దిద్దడం ఇలాగా?.. ఎంత నిర్లక్ష్యమా? అంటూ ఇంటర్‌ బోర్డుకు క్యూ కడుతున్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 100కి 98, 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు 

సెకండియర్‌లో వచ్చిన మార్కులను చూసి హతాశులవుతున్నారు. సరిగ్గా జవాబులను పరిశీలించకుండానే తమకు ఎంత తోస్తే అన్ని మార్కులు వేయడం.. మొత్తం మార్కుల కూడికలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత సుమారు 48 వేల మంది పునఃపరిశీలనకు, మరో 2 వేల మంది పునఃలెక్కింపునకు దరఖాస్తు చేసుకున్నారు. పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తాము రాసిన జవాబుపత్రాలను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని ఇంటర్‌బోర్డు తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు ఇంటర్‌లో అధిక మార్కులు పొందిన వారికి బీటెక్, ఇతర కోర్సుల్లో ఫీజు లేకుండా సీట్లు ఇస్తున్నారు. మరికొన్ని వర్సిటీలు కనీస మార్కుల నిబంధన విధిస్తున్నాయి. మూల్యాంకనంలో జరుగుతున్న దారుణాలతో వారు నష్టపోతున్నారు. దీనిపై బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ కొందరు విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వారి జవాబుపత్రాలను నిపుణులకు చూపించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇంటర్‌బోర్డు తప్పిదాలూ కారణమే 

కొన్ని కార్పొరేట్, పలు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు పేపర్ల మూల్యాంకనానికి ట్యూటర్లను, జూనియర్‌ అధ్యాపకులను పంపుతున్నాయి. వారు మిడిమిడి జ్ఞానంతో మార్కులు వేస్తున్నారు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంటర్‌బోర్డు తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. 2019లో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కూడా బోర్డు జవాబుపత్రాల మూల్యాంకనంపై దృష్టి పెట్టడం లేదు. మార్కులు తేడా వస్తే జరిమానా వేసి చేతులు దులిపేసుకుంటున్నారు. అధ్యాపకులు తప్పు చేసినప్పుడు కళాశాలల యాజమాన్యాలకు కూడా నోటీసులు పంపి చర్యలు తీసుకోవాలని.. అసలు వారివద్ద పనిచేస్తున్న అధ్యాపకుల జాబితా తీసుకొని ఏటా అందులో కొంత శాతం మంది తప్పకుండా మూల్యాంకనానికి వచ్చేలా ఆదేశాలివ్వాలని పలువురు సూచిస్తున్నారు.


ఎంపీసీ విద్యార్థి ఒకరికి భాషా సబ్టెక్టులో 21 మార్కులు వచ్చాయి. దీనిపై రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా.. పరిశీలనలో ఏకంగా 91 మార్కులు దక్కాయి. ఆ జవాబుపత్రాన్ని పరిశీలించిన ఇంటర్‌బోర్డు అధికారులు.. మూల్యాంకనం జరిగిన విధానాన్ని చూసి తలలు పట్టుకున్నారు.


హైదరాబాద్‌ జిల్లాకు చెందిన ఎంఈసీ విద్యార్థిని ఎస్‌.సంహితకు మొత్తం 926 మార్కులు వచ్చాయి. తొలి ఏడాది కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ పేపర్‌లో 100కి 98 వచ్చాయి. కానీ సెకండియర్‌లో 77 మాత్రమే దక్కాయి. వాస్తవానికి ఆ సబ్జెక్టులో ఆమె వేసుకున్న లెక్క ప్రకారం కనీసం 95 మార్కులు రావాలి. ఈ విద్యార్థిని పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకోగా.. మార్కుల్లో ఎటువంటి మార్పు లేదని ఇంటర్‌బోర్డు సమాచారం ఇచ్చింది. అనంతరం జవాబుపత్రాన్ని ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థిని డౌన్‌లోడ్‌ చేసుకుంది.  అధ్యాపకుడు తొలుత 97 మార్కులు వేసి.. తర్వాత దాన్ని 77గా మార్చినట్లు పేపర్లను చూస్తే స్పష్టమవుతోంది. పలు ప్రశ్నలకు మొదట ఇచ్చిన మార్కుల్ని కూడా దిద్దినట్లు ఓఎంఆర్‌ షీట్‌లో కనిపిస్తోంది. ఈ విద్యార్థిని మార్కుల విషయమై నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఇంటర్‌ బోర్డులోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 


పలువురు విద్యార్థులు ప్రశ్నలకు సరైన జవాబులు రాసినా... సున్నా మార్కులు వేశారు. జనగామకు చెందిన స్వాతి అనే విద్యార్థిని 984 మార్కులు సాధించింది. సెకండియర్‌ రసాయనశాస్త్రంలో మొదట 57 మార్కులు వేశారు. పునఃపరిశీలనలో 59 దక్కాయి. రెండు మార్కుల ప్రశ్నకు సున్నా మార్కులు వేశారు. పరిశీలన అనంతరం దాన్ని సరిదిద్దారు. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. ఇలాంటి బాధిత విద్యార్థులు వందల మంది ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని