Sheep Scam: రూ.700 కోట్లలో ఎవరి వాటా ఎంత?

గొర్రెల సరఫరా పథకం కుంభకోణం విలువను రూ.700 కోట్లుగా గుర్తించిన అవినీతి నిరోధకశాఖ.. దర్యాప్తును ముమ్మరం చేసింది. ఒక ప్రభుత్వ పథకంలో ఇంత భారీ మొత్తం కొల్లగొట్టడం వెనక ‘పెద్దల’ పాత్ర తప్పనిసరిగా ఉండి ఉంటుందని అనుమానిస్తోంది.

Updated : 06 Jun 2024 06:59 IST

గొర్రెల పథకం కుంభకోణం సొమ్ము పంపకాలపై అనిశా దృష్టి
మొహిదుద్దీన్‌ బ్యాంకు లావాదేవీల పరిశీలన
పెద్దల పాత్రను నిగ్గు తేల్చే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: గొర్రెల సరఫరా పథకం కుంభకోణం విలువను రూ.700 కోట్లుగా గుర్తించిన అవినీతి నిరోధకశాఖ.. దర్యాప్తును ముమ్మరం చేసింది. ఒక ప్రభుత్వ పథకంలో ఇంత భారీ మొత్తం కొల్లగొట్టడం వెనక ‘పెద్దల’ పాత్ర తప్పనిసరిగా ఉండి ఉంటుందని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో అనిశా తదుపరి దర్యాప్తునకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పథకానికి అనధికారిక కాంట్రాక్టర్‌గా వ్యవహరించిన లొలొన కంపెనీ నిర్వాహకుడు మొహిదుద్దీన్‌.. కేసు నమోదైన వెంటనే దుబాయ్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. అతడిని తిరిగి రప్పించేందుకు అనిశా లుక్‌అవుట్‌ నోటీస్‌ జారీ చేయించింది. అతడిని విచారిస్తే పెద్దల పాత్రపై కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తోంది. కొట్టేసిన సొమ్మును ఎవరెవరు పంచుకున్నారో తేల్చేందుకు.. అరెస్టయిన నిందితుల, మొహిదుద్దీన్‌ బ్యాంకు లావాదేవీలపై అనిశా దృష్టిసారించింది. 

అనుకూలమైన అధికారులను నియమించుకుని..

ఈ కేసులో కామారెడ్డి ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకుడు డా.రవి, మేడ్చల్‌ జిల్లా పశువైద్యశాఖ సహాయ సంచాలకుడు డా.ఎం.ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జలశాఖ అధికారి పసుల రఘుపతిరెడ్డి, వయోజన విద్యాశాఖ ఉపసంచాలకుడు సంగు గణేశ్, పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు అంజిలప్ప, సహాయ సంచాలకుడు కృష్ణయ్యను గతంలోనే అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్యకు ఎండీగా పనిచేసిన రాంచందర్‌నాయక్‌తోపాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓఎస్డీగా పనిచేసిన కల్యాణ్‌ను ఇటీవలే అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పటి ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖను పర్యవేక్షించిన పెద్దల ఆశీస్సులతో ఉన్నతాధికారులను మొహిదుద్దీన్‌ గుప్పిట పెట్టుకున్నట్లు అనిశా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తద్వారా శాఖలో తమకు అవసరమైన పోస్టుల్లో అనుకూలమైన అధికారులను నియమించుకుని కుట్రలకు తెర లేపినట్లు గుర్తించారు. గొర్రెల కొనుగోలు మొదలు, డబ్బుల్ని సరఫరాదారుల ఖాతాల్లో కాకుండా మొహిదుద్దీన్‌ బినామీల ఖాతాల్లో పడేలా రికార్డుల్ని తారుమారు చేయడంలో ఈ అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఒక్కో యూనిట్‌లో మొహిదుద్దీన్‌ ముఠా సుమారు రూ.33 వేల వరకు కొట్టేసినట్లు బహిర్గతమైంది. చాలా యూనిట్లను సరఫరా చేయకుండానే మొత్తం నిధుల్ని స్వాహా చేసినట్లు తేలింది. ఈ క్రమంలో పలువురికి రూ.కోట్లలో వాటాలు ముట్టాయి. ప్రభుత్వ నిధులను తొలుత మొహిదుద్దీన్‌ బినామీల ఖాతాలకు మళ్లించినట్లు వెల్లడి కావడంతో అనిశా అధికారులు వాటిని విశ్లేషించడం ద్వారా కీలక సమాచారం రాబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు