కొత్త బంగారు లోకం... చిప్ల రంగం!
మానవ నాగరికతకు 20వ శతాబ్దంలో చమురు చోదక శక్తిగా నిలిచింది. 21వ శతాబ్దిని మాత్రం చిప్లే నడిపిస్తున్నాయి. నేడు కార్లు, ఫ్రిజ్లు, స్మార్ట్ ఫోన్లు, ఎలెక్ట్రానిక్స్ ఉపకరణాలతో పాటు రక్షణ, అంతరిక్ష రంగాల్లో చిప్లే కీలకం. భారత్ ఈ రంగంలో అంతర్జాతీయ శక్తిగా అవతరించేందుకు అడుగులు వేస్తోంది. భారత్ దేశీయంగా చిప్ల తయారీకి అమిత ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల రూ.1.25 లక్షల...
మానవ నాగరికతకు 20వ శతాబ్దంలో చమురు చోదక శక్తిగా నిలిచింది. 21వ శతాబ్దిని మాత్రం చిప్లే నడిపిస్తున్నాయి. నేడు కార్లు, ఫ్రిజ్లు, స్మార్ట్ ఫోన్లు, ఎలెక్ట్రానిక్స్ ఉపకరణాలతో పాటు రక్షణ, అంతరిక్ష రంగాల్లో చిప్లే కీలకం. భారత్ ఈ రంగంలో అంతర్జాతీయ శక్తిగా అవతరించేందుకు అడుగులు వేస్తోంది.
భారత్ దేశీయంగా చిప్ల తయారీకి అమిత ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న మూడు సెమీకండక్టర్ కర్మాగారాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇందులో గుజరాత్లో రెండు, అస్సామ్లో ఒక పరిశ్రమ ఏర్పాటవుతాయి. వీటితో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం భారత్లో పెద్దయెత్తున స్మార్ట్ ఫోన్లు తయారవుతున్నా, వాటికి కావలసిన చిప్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. స్మార్ట్ ఫోన్ల తయారీలో చిప్లే కీలకం. సెమీకండక్టర్ల దిగుమతికి మనదేశం ఎంతో విదేశ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఈ రంగంలోకి స్వదేశీ, విదేశీ కంపెనీలను పెద్దయెత్తున ఆకర్షించాలని కేంద్ర ప్రభుత్వం నడుంకట్టింది. స్వదేశంలో చిప్ల తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం 10,000 కోట్ల డాలర్లను కేటాయించింది. ఆమోదం పొందిన చిప్ తయారీ ప్రాజెక్టులకు సబ్సిడీలనూ కల్పించనుంది.
వైఫల్యాలను అధిగమించి...
సెమీకండక్టర్లు లేనిదే మానవ జీవితం ముందుకు సాగలేని పరిస్థితులు నెలకొన్నాయి. అంతటి ప్రాముఖ్యమున్న చిప్ల తయారీలో అమెరికా, జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, చైనాలు అగ్రగాములుగా కొనసాగుతున్నాయి. సెమీకండక్టర్ల తయారీలో గతంలో ఎదుర్కొన్న వైఫల్యాలను అధిగమించి, ఈ రంగంలో అగ్రగాముల సరసన నిలవాలని ఇండియా లక్షిస్తోంది. ‘సెమీకండక్టర్లను తయారు చేయాలన్న ఆకాంక్ష 1960ల్లోనే మన దేశంలో నెలకొన్నా, ఆ కలలు వాస్తవ రూపం దాల్చలేదు... చిప్ల తయారీ ద్వారా అపరిమిత అవకాశాలు కల్పించేందుకు సన్నద్ధమయ్యా’మని ప్రధాని మోదీ ఇటీవల స్పష్టం చేశారు. ఆపిల్, గూగుల్ వంటి సంస్థలు భారత్లో ఎలెక్ట్రానిక్స్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఆపిల్ భారత్లో తయారుచేసిన ఐఫోన్లను అంతర్జాతీయ మార్కెట్కు సరఫరా చేస్తోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఈ ఏడాది నుంచి భారత్లో స్మార్ట్ఫోన్ల కూర్పు ప్రక్రియను చేపడుతోంది. అమెరికాకు చెందిన మైక్రాన్ సంస్థ గుజరాత్లో సెమీకండక్టర్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్లోని ధోలేరా చిప్ల తయారీ కేంద్రంగా అవతరిస్తోంది. సెమీకండక్టర్లు లేదా చిప్ల తయారీకి ఉద్దేశించిన భారీ పెట్టుబడి ప్రతిపాదనలు స్వదేశీ కంపెనీలతోపాటు విదేశీ కంపెనీల నుంచి కూడా వచ్చాయి. తైవాన్కు చెందిన పవర్చిప్ కంపెనీతో కలిసి టాటా గ్రూప్ సెమీకండక్టర్ కర్మాగారాన్ని చేపడుతోంది. టాటా గ్రూప్ ఇప్పటికే స్మార్ట్ ఫోన్ విడిభాగాలు, కూర్పు పరిశ్రమలను నెలకొల్పింది. జపాన్కు చెందిన ‘రెనెసాస్ ఎలెక్ట్రానిక్స్ కార్పొరేషన్’- ఇండియా చిప్ తయారీ రంగంలో ప్రవేశించాలన్న ఉత్సుకత కనబరుస్తోంది. ఇప్పటికే అది భారతీయ సంస్థ భాగస్వామ్యంతో ముందుకు సాగుతోంది. ఇజ్రాయెలీ సంస్థ సైతం భారత్లో చిప్లను తయారుచేయాలని లక్షిస్తోంది. నేడు 57,000 కోట్ల డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ చిప్ మార్కెట్ ఈ దశాబ్ది అంతానికి లక్ష కోట్ల డాలర్ల పరిశ్రమగా అవతరించనున్నది. ఈ రంగంలో అపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రధాన దేశాలు పోటీ పడుతున్నాయి.
చిప్ రంగంలో సెమీకండక్టర్ డిజైనింగ్, ఉత్పత్తి, కూర్పు అనే మూడు ప్రధాన విభాగాలున్నాయి. ఒక్కో దేశం ఒక్కో విభాగంలో నైపుణ్యం సాధించింది. అమెరికా చిప్ డిజైనింగ్లో అగ్రగామిగా పేరొందింది. 72 శాతం దాకా చిప్ డిజైన్ సాఫ్ట్వేర్, లైసెన్సుల విక్రయాలు అమెరికన్ కంపెనీల చేతుల మీదుగానే నడుస్తున్నాయి. అంతర్జాతీయ చిప్ డిజైన్ అమ్మకాలలో 46శాతం వాటా అమెరికాదే. చిప్ తయారీ మార్కెట్లో 50శాతం వాటా తైవాన్దే. 17శాతం వాటాతో దక్షిణ కొరియా రెండో స్థానం ఆక్రమిస్తోంది. తరవాతి స్థానాలను జపాన్, చైనాలు చేజిక్కించుకున్నాయి. చిప్ల కూర్పు ప్రధానంగా చైనా, తైవాన్, దక్షిణ కొరియాలలో జరుగుతోంది. ఈ విషయంలో చైనాదే అగ్ర స్థానం. భారత్లో ప్రస్తుతం 3,518 కోట్ల డాలర్లుగా ఉన్న చిప్ మార్కెట్ పరిమాణం 2026కల్లా 6,400 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. ఇప్పటికే 19,200 కోట్ల డాలర్ల చిప్ మార్కెట్తో చాలా ముందున్న చైనా- ఈ రంగంలో మరింత భారీగా పెట్టుబడులు గుమ్మరించనుంది.
ఇతర రంగాల్లో అభివృద్ధికి ఊతం
‘ఆత్మనిర్భర్’ కార్యక్రమం కింద చిప్ల తయారీ, కూర్పు రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణికి చేరాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. 2035కల్లా లక్ష కోట్ల డాలర్ల సెమీకండక్టర్ మార్కెట్ను సృష్టించదలచింది. అందుకు అనుగుణంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద అంతర్జాతీయ చిప్ తయారీదారులను ఆకర్షించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఐఎస్ఎంలో నాలుగు అంతర్భాగాలున్నాయి. అవి- భారత్లో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ల స్థాపన, డిస్ప్లే ఫ్యాబ్ల ఏర్పాటు, కాంపౌండ్ సెమీకండక్టర్లు, ఏటీఎంపీ తయారీ కేందాల స్థాపన, డిజైన్ సంబంధిత ప్రోత్సాహక పథకం. దేశంలో మొట్టమొదట 2022లో ప్రత్యేక సెమీకండక్టర్ విధానాన్ని ఆవిష్కరించిన ఘనత గుజరాత్కు దక్కుతుంది. తదుపరి స్థానాలను ఉత్తర్ప్రదేశ్, ఒడిశాలు ఆక్రమిస్తున్నాయి. గుజరాత్లో నెలకొల్పుతున్న చిప్ల తయారీ కేంద్రాలు భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. సెమీకండక్టర్లను రక్షణ, ఆటొమోటివ్, ఎలెక్ట్రానిక్స్ వస్తువుల్లో సైతం అమర్చుతారు. చిప్ల కర్మాగారాలు ఇతర రంగాల అభివృద్ధికీ ఎంతగానో ఊతమిస్తాయి. సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడి పెట్టడమంటే భారతదేశ భవిష్యత్తుపై పెట్టుబడులు పెట్టడమే!
నిపుణులకు అవకాశం
చిప్ల తయారీకి పెద్ద సంఖ్యలో నిపుణులు అవసరం. యువజనాభా అధికంగా ఉన్న భారత్ ఇలాంటి నిపుణులను స్వదేశీ పరిశమలకే కాకుండా, అంతర్జాతీయ చిప్ తయారీదారులకు సైతం సమకూర్చే అవకాశం ఉంది. చైనా ఒకవేళ తైవాన్పై దాడి చేస్తే అంతర్జాతీయ సెమీకండక్టర్ మార్కెట్ అతలాకుతలమవుతుంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి చిప్ల తయారీని ఇతర దేశాలకు విస్తరించే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకోవాలి. సెమీకండక్టర్ల రంగంలో సుస్థిర సరఫరా గొలుసుల ఏర్పాటుకు నిరుడు అమెరికా, భారత్లు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. క్వాడ్ గ్రూపు 2021లోనే సెమీకండక్టర్ సరఫరా గొలుసు ప్రాజెక్టును ప్రకటించింది. ఇది మరింత వేగంగా ముందుకు సాగాల్సిన అవసరముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్