Whooping cough: ఆ దేశాల్లో ‘కోరింత దగ్గు’ కలవరం.. ఫిలిప్పీన్స్‌లో 54 మరణాలు

చైనా, ఫిలిప్పీన్స్‌, చెక్‌ రిపబ్లిక్‌తోపాటు నెదర్లాండ్‌ దేశాలను కోరింత దగ్గు (Whooping Cough) కలవరపెడుతోంది.

Published : 11 Apr 2024 17:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోరింత దగ్గు (Whooping Cough) కలవరపెడుతోంది. చైనా, ఫిలిప్పీన్స్‌, చెక్‌ రిపబ్లిక్‌తోపాటు నెదర్లాండ్స్‌లో అనేక మరణాలు నమోదవుతున్నాయి. కేవలం ఫిలిప్పీన్స్‌లోనే మూడు నెలల్లో 54 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియాల్లోనూ ఈ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఫిలిప్పీన్స్‌ ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం, ఈ ఏడాది మూడు నెలల్లోనే సుమారు వెయ్యి కోరింత దగ్గు కేసులు నమోదయ్యాయి. 54 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. క్రితం ఏడాదితో పోలిస్తే కేసుల సంఖ్య 34 రెట్లు పెరిగింది. చైనాలో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో 32వేల కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 20 రెట్లు అధికం. బ్రిటన్‌లోనూ ఇటీవల ఈ కేసులు పెరిగినట్లు అక్కడి వైద్యాధికారులు పేర్కొన్నారు. కేవలం జనవరిలోనే 553 కేసులు నమోదయ్యాయి. దాంతో వ్యాక్సిన్‌ తీసుకోవడంలో చిన్నారులు, గర్భిణులు నిర్లక్ష్యం వహిస్తుండటంపై స్థానిక ప్రభుత్వం ఇటీవల హెచ్చరించింది. ఆస్ట్రేలియాలోనూ గత మూడు నెలల్లో 2,799 వూపింగ్‌ కాఫ్‌ కేసులు రికార్డయ్యాయి.

లక్షణాలేంటీ..?

కోరింత దగ్గు.. శాస్త్రీయనామం పెర్టుసిస్‌ (Pertussis). బోర్డిటెల్లా పెర్టుసిస్‌ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. గాలి ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. తొలుత జలుబు లక్షణాలతో మొదలై జ్వరం, వదలని దగ్గు వంటివి తీవ్రంగా ఉంటాయి. సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాలు ఉంటుంది. కొందరిలో 12 వారాల వరకు దీని ప్రభావం ఉంటుంది. అందుకే దీన్ని వంద రోజుల దగ్గు (100-day Cough) అని కూడా పిలుస్తారు.

వారికి ప్రాణాంతకం..

ఈ ఇన్‌ఫెక్షన్‌ అన్ని వయసులవారికి సంక్రమించే అవకాశం ఉన్నప్పటికీ చిన్న పిల్లల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వారికి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా వ్యాక్సిన్‌ తీసుకోని నవజాత శిశువులకు ప్రాణాంతకంగా మారుతుంది. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో మాత్రం ప్రభావం తక్కువే. వ్యాధి నిర్ధరణ తర్వాత యాంటీబాడీల వృద్ధి కోసం చికిత్స ఇస్తారు. ప్రతీ మూడు, నాలుగేళ్లకు ఒకసారి ఈ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని