China: చైనాలో మళ్లీ కొవిడ్‌ పంజా.. జూన్‌ నాటికి వారానికి 6.5కోట్ల కేసులు..!

Covid In China: చైనాలో కొవిడ్ ఉద్ధృతి మళ్లీ మొదలైంది. కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జూన్‌ చివరి నాటికి ఈ వ్యాప్తి గరిష్ఠ స్థాయికి చేరి వారానికి 6.5కోట్ల కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Updated : 26 May 2023 13:22 IST

బీజింగ్‌: కరోనా వైరస్‌ (Corona Virus) పుట్టినిల్లు చైనా (China)లో మరోసారి మహమ్మారి కోరలు చాచుతోంది. కొవిడ్ కొత్త వేవ్‌ (Covid New Wave) కారణంగా గత కొన్ని రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జూన్‌ చివరి నాటికి ఈ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరి వారానికి 6.5కోట్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు డ్రాగన్‌ దేశంలో కరోనా ఉద్ధృతిపై అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.

ఒమిక్రాన్‌ (Omicron) XBB వేరియంట్‌ కారణంగా చైనాలో ఏప్రిల్‌ నుంచి రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మే చివరి నాటికి వారానికి 4 కోట్ల కేసులు (Corona Cases) నమోదయ్యే అవకాశముందని స్థానిక వైద్య నిపుణులు చెప్పినట్లు ఆ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక జూన్‌ చివరి నాటికి వారానికి 6.5కోట్ల మంది వైరస్‌ బారిన పడే ప్రమాదమున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. 2022 డిసెంబరులో చైనా జీరో కొవిడ్‌ (Zero Covid) విధానానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు వైరస్‌ కొత్త వేవ్‌లు వచ్చినప్పటికీ.. ఈ స్థాయిలో ఉద్ధృతి కనిపించడం ఇప్పుడేనని డ్రాగన్‌ వైద్య నిపుణులు చెబుతున్నారు.

తాజా వైరస్‌ ఉద్ధృతితో అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ ప్రొగ్రామ్‌ను మరింత వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. ఒమిక్రాన్‌ (Omicron) XBB వేరియంట్లకు రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం ఉండటంతో ఈ కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో XBB వేరియంట్లను ఎదుర్కొనే టీకాలను అభివృద్ధి చేస్తున్నామని చైనీస్‌ అంటువ్యాధుల నిపుణుడు జాంగ్‌ నన్షాన్‌ చెప్పిన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇప్పటికే రెండు టీకాలను తీసుకురాగా.. త్వరలోనే మరో నాలుగు కొత్త వ్యాక్సిన్లకు (Vaccines) అనుమతులు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత ఉద్ధృతిలో వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. తీవ్రత తక్కువగానే ఉండే అవకాశాలున్నట్లు చైనీస్‌ అధికారులు చెబుతున్నారు. అయితే, వృద్ధులపై దీని ప్రభావం అధికంగా ఉండనుందని, ఆ వయసువారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గత డిసెంబరులో చైనాలో జీరో కొవిడ్‌ పాలసీని ఎత్తేసిన తర్వాత దాదాపు 85శాతం మంది జనాభా అనారోగ్యానికి గురైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని