China: చైనా సైన్యం చేతిలో రోబో భౌ భౌ.. కంబోడియాలో ప్రదర్శించిన డ్రాగన్‌

డ్రాగన్‌ సైన్యం సరికొత్త రోబో ఆయుధాన్ని సిద్ధం చేస్తోంది. పట్టణాల్లో జరిగే పోరాటాల్లో చురుగ్గా కదిలేలా తుపాకీ అమర్చిన రోబో కుక్కను సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది.

Updated : 29 May 2024 12:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా (China) సైన్యం ఆధునికీకరణ అత్యంత వేగంగా జరుగుతోంది. తాజాగా అభివృద్ధి చేసిన రోబో డాగ్స్‌ను కంబోడియాలో జరిగిన సైనిక విన్యాసాల్లో మరోసారి ప్రదర్శించింది. ఈ మర శునకంపై ఓ ఆటోమేటిక్‌ రైఫిల్‌ను అమర్చారు. లక్ష్యంపై గురితప్పకుండా కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్లేలా డిజైన్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను చైనా ప్రభుత్వరంగ మీడియా సంస్థ సీసీటీవీ ప్రసారం చేసింది. ‘‘మా పట్టణ యుద్ధ తంత్రంలో సరికొత్త సభ్యుడు వచ్చాడు. గస్తీ, శత్రువును గుర్తించడం, లక్ష్యంపై దాడి చేయడానికి మనుషుల స్థానంలో ఇది రానుంది’’ అని ఆ వీడియోలో వెల్లడించారు. కంబోడియాలో నిర్వహించిన ‘గోల్డెన్‌ డ్రాగన్‌-2024’ యుద్ధ విన్యాసాల సందర్భంగా దీనిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో డ్రోన్‌ తుపాకులను కూడా చైనా సైన్యం ప్రదర్శించింది. వాస్తవానికి గతేడాది నవంబర్‌లో కూడా చైనా, కంబోడియా, వియత్నాం పాల్గొన్న సంయుక్త సైనిక విన్యాసాల్లో ఇవి కనిపించాయి.

ఈ మర కుక్కలు బ్యాటరీపై ఆధారపడి రెండు నుంచి నాలుగు గంటలపాటు పనిచేస్తాయి. ముందుకు, వెనక్కు, పడుకోవడం, దూకడం వంటివి చేయగలవు. దీనిలోని మ్యాప్‌ల ఆధారంగా మార్గనిర్దేశం చేసుకొని లక్ష్యం వైపు ప్రయాణిస్తాయి. మార్గం మధ్యలో ఎదురయ్యే ఎటువంటి అడ్డంకులనైనా తప్పించుకోగలవు. వీటిని డ్రోన్ల సాయంతో మోహరించే అవకాశం ఉంది. చైనాకు చెందిన యూనీట్రీ సంస్థ ఈ మర కుక్కలను రూపొందించినట్లు తెలుస్తోంది. వీటి ఖరీదు మోడల్‌ను బట్టి 2,800 డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు ఉంది. చైనా సైనిక బడ్జెట్‌ ప్రస్తుతం అధికారికంగా 231 బిలియన్‌ డాలర్లు.  

ఈ రోబో కుక్క బరువు 15 కిలోలు ఉంటుంది. దీనిలో ఇన్‌బిల్ట్‌ సెన్సర్లు ఉంటాయి. 4డీ వైడ్‌ యాంగిల్‌ పర్సిప్షన్‌ సిస్టమ్‌ను అమర్చారు. సైనికులతో సమానంగా ఇది యుద్ధ విన్యాసాలు చేయగలదు. 

మరోవైపు అమెరికా వాయుసేన 2020లో రోబోడాగ్స్‌ వినియోగాన్ని పరీక్షించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా అనలటిక్స్‌ను వాడుకొని పనిచేసే అడ్వాన్స్‌డ్‌ బ్యాటిల్‌ మేనేజ్‌మెంట్ వ్యవస్థలో ఇదొక భాగం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని