Viral Post: మనసు బాగోలేదా అయితే సెలవు తీసుకోండి..

చైనాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Updated : 12 Apr 2024 16:15 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సెంట్రల్ చైనాలోని రిటైల్ సంస్థ పాంగ్ డాంగ్ లాయ్‌ (సూపర్ మార్కెట్) వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ యు డాంగ్లాయ్(Yu Donglai) తమ కంపెనీకి లాభాలు తెస్తున్న ఉద్యోగులకు పదిరోజుల లీవ్‌ ఆఫర్‌ ఇచ్చారు. విధులకు హాజరు కావడానికి మానసికంగా సిద్ధంగా లేని రోజున సెలవు కోరవచ్చు. ఈ లీవ్‌ను మేనేజ్‌మెంట్‌ కుదరదని చెప్పడానికి వీల్లేదని షరతు కూడా విధించారు.

“ప్రతీ ఉద్యోగి స్వేచ్ఛగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దానివల్ల ఉద్యోగుల మనసు బాగోలేకపోతే వారు సెలవు తీసుకోవచ్చు. ఈ సెలవుల వల్ల వారు తమ మనసును తేలిక పరుచుకొని నూతన ఉత్సాహంతో తిరిగి పనుల్లోకి వస్తారు. నా విధానం ప్రకారం ఉద్యోగులను ఓవర్ టైం పని చేయమని బలవంతం చేయడం అనైతికం. రోజుకు ఏడు గంటలు మాత్రమే పని చేయాలి, వారాంతాల్లో సెలవులు ఉండాలి, 30 నుంచి 40 రోజుల వార్షిక సెలవులు ఇవ్వాలి. మా కంపెనీ అత్యధిక లాభాలు పొందాలని నేను అనుకోను. మా ఉద్యోగులు ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించాలని మేము కోరుకుంటున్నాము. దానివల్ల కంపెనీ అభివృద్ధి చెందుతుంది.” అని యు తెలిపారు. కాగా  పాంగ్ డాంగ్ లై సూపర్‌మార్కెట్‌లో పని చేసే ఉద్యోగుల సగటు నెలవారీ జీతం 7,000 యువాన్లు (రూ. 80,878). ‘అన్‌హ్యాపీ లీవ్‌’ కింద ఏడాదిలో 10 రోజుల లీవ్‌ను సంస్థ ఇస్తుంది. వార్షిక సెలవులకు ఇవి అదనం.

ఈ ప్రకటనకు సంబంధించిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో యు డాంగ్లాయ్ ఆలోచనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘ఇంత మంచి బాస్ ఉంటారా?, ఈ కార్పొరేట్ సంస్కృతిని దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల్లో ప్రచారం చేయాలి’ అని రాసుకొచ్చారు. “నేను నా ఉద్యోగం మానేసి పాంగ్ డాంగ్ లాయ్‌ మార్కెట్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అక్కడ ఆనందాన్ని, గౌరవాన్ని పొందుతానని అనుకుంటున్నాను” అంటూ మరొకరు స్పందించారు.

‘కార్యాలయాల్లో ఉద్యోగులపై పని ఒత్తిడి’ అనే విషయంపై 2021లో చైనాలో నిర్వహించిన  సర్వే ప్రకారం, 65 శాతానికి ఎక్కువ మంది కార్మికులు తమ పనిపై అసంతృప్తిగా ఉన్నారని తేలింది. తక్కువ వేతనాలు, సుదీర్ఘ పని గంటలు, ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు లేకపోవడం ఉద్యోగుల్లో ప్రతికూల భావోద్వేగాలకు ప్రధాన కారణాలుగా సర్వే పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని