USA: పన్నూ హత్యకు కుట్ర కేసు : చెక్‌ కోర్టులో నిఖిల్‌ గుప్తాకు ఎదురుదెబ్బ..!

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర పన్నిన కేసులో ప్రధాన నిందితుడు నిఖిల్‌ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు చెక్‌ కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

Published : 23 May 2024 16:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు జరిగిన కుట్ర కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. దీనిలో ప్రధాన నిందితుడిగా ఉన్న భారతీయుడు నిఖిల్‌ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు చెక్‌ రాజ్యాంగ కోర్టు అంగీకారం తెలిపింది. ఈ అప్పగింతను సవాలు చేస్తూ గతంలో అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో గుప్తా అప్పగింతపై ఆ దేశ జస్టిస్‌ మినిస్టర్‌ పావెల్‌ బ్లాజెక్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

దిగువ కోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఇది రాజకీయ ప్రేరేపితమన్న అతడి వాదనను కూడా తోసిపుచ్చింది. ‘‘అతడి అప్పగింత వల్ల రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ఉల్లంఘన జరుగుతుందని న్యాయస్థానం భావించడం లేదు’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో అక్కడి కోర్టుల్లో అతడి న్యాయపోరాటం ముగిసింది. 

గతేడాది జూన్‌ 30న చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో అడుగుపెట్టిన వెంటనే నిఖిల్‌ గుప్తాను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు గుప్తా కుట్ర పన్నినట్లు ఆరోపణలు మోపారు. మరోవైపు అతడిని తమకు అప్పగించాలని అమెరికా ప్రాసిక్యూటర్స్‌ ఇప్పటికే చెక్‌ ప్రభుత్వాన్ని కోరారు. భారత అధికారుల సూచనల మేరకు పన్నూ హత్యకు కొందరు కిరాయి హంతకులను నియమించేందుకు నిఖిల్‌ గుప్తా ప్రయత్నించాడన్నది ప్రధాన అభియోగం. 

మరోవైపు ఇప్పటికే శ్వేతసౌధం ప్రతినిధులు భారత్‌లోని సీనియర్‌ అధికారుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి.. కేసు దర్యాప్తునకు సహకరించాలని కోరాయి.  భారత్‌ కూడా ఈ అంశంపై దర్యాప్తు చేపట్టేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని