Donald Trump: కోర్టుకు రూ.1,460 కోట్ల బాండును సమర్పించిన ట్రంప్‌

Trump: బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేశారన్న కేసులో కోర్టు విధించిన 175 మిలియన్‌ డాలర్ల జరిమానాను బాండు రూపంలో ట్రంప్‌ సమర్పించారు.

Updated : 02 Apr 2024 13:19 IST

న్యూయార్క్‌: అమెరికా (USA) అధికార పీఠాన్ని రెండోసారి దక్కించుకునేందుకు బరిలోకి దిగిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తాజాగా కోర్టులో 175 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1,460 కోట్లు) బాండ్‌ సమర్పించారు. తద్వారా తనకు విధించిన 454 మిలియన్‌ డాలర్ల జరిమానా విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకొన్నారు. దీంతో ప్రభుత్వం ఆయన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉండదు.

ట్రంప్‌ తన ఆస్తుల మొత్తాన్ని వాస్తవిక విలువ కంటే అధికంగా చూపి బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల పాటు ఇలా మోసపూరితంగా వ్యాపార రుణాలు, బీమా పొందారన్న అభియోగాలపై కేసు నమోదైంది. న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌, డెమోక్రాట్‌ నేత లెటిటియా జేమ్స్‌ ఈ దావా వేశారు. దీనిపై రెండున్నర నెలల పాటు విచారణ జరిపిన కోర్టు 454 మిలియన్‌ డాలర్ల జరిమానా విధిస్తూ ఫిబ్రవరిలో తీర్పు వెలువరించింది. దీనిపై అప్పీల్‌కు వెళ్తామని.. జరిమానాను రద్దు చేయాలని ట్రంప్‌ (Donald Trump) న్యాయవాదుల బృందం కోరింది. అప్పటి వరకు ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన కోర్టు హామీ కింద 175 మిలియన్‌ డాలర్లు కోర్టులో సమర్పించాలని ఆదేశించింది.

ఒకవేళ పైకోర్టులో ట్రంప్‌ దోషిగా తేలితే.. తాజాగా దాఖలు చేసిన 175 మిలియన్‌ డాలర్ల బాండు ఆయనకు తిరిగి రాదు. అలాగే 454 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్దోషిగా తేలితే ఆయన బాండును తిరిగి ఇచ్చేస్తారు. దీనిపై సెప్టెంబరులో వాదనలు జరగనున్నాయి. తనపై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని ట్రంప్‌ (Donald Trump) తొలి నుంచి వాదిస్తూ వస్తున్నారు.

వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌తో తలపడేందుకు సిద్ధమైన ట్రంప్‌ను పలు న్యాయపరమైన వివాదాలు వెంటాడుతున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ‘క్యాపిటల్‌ హిల్‌’ ఘటనలో ఆయన పాత్రపై ఇప్పటికే కోర్టులో విచారణ కొనసాగుతోంది. మరోవైపు రచయిత జీన్‌ కరోల్‌పై లైంగిక ఆరోపణల కేసులో ఆయన ఇప్పటికే కోర్టుకు 97 మిలియన్‌ డాలర్లు విలువ చేసే మొత్తాన్ని బాండు, నగదు రూపంలో సమర్పించారు. పులిట్జర్‌ పురస్కారం పొందిన పాత్రికేయులపై కేసు నమోదు చేసిన వ్యవహారంలో వారికి న్యాయపరమైన ఖర్చుల కింద కోర్టు ఆదేశాల మేరకు 3,92,638 డాలర్లు చెల్లించారు. మరోవైపు ఓ కంపెనీపై తప్పుడు కేసు విషయంలో బ్రిటిష్‌ కోర్టు ఆదేశాల మేరకు 3,82,000 డాలర్లు లీగల్‌ ఫీజుల కింద ఇవ్వాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని