క్రిమియాలో రష్యా క్షిపణుల ధ్వంసం

పాశ్చాత్య దేశాల నుంచి అందుతున్న ఆయుధ సహాయంతో రష్యాను పలురకాలుగా ఉక్రెయిన్‌ దెబ్బకొడుతోంది.

Published : 22 Mar 2023 04:23 IST

ఆ పని చేసింది మేమేనన్న ఉక్రెయిన్‌
లేదు.. విద్యుత్‌ లైన్లనే నాశనం చేశారన్న క్రిమియా అధికారులు

కీవ్‌: పాశ్చాత్య దేశాల నుంచి అందుతున్న ఆయుధ సహాయంతో రష్యాను పలురకాలుగా ఉక్రెయిన్‌ దెబ్బకొడుతోంది. తాజాగా రష్యా ఆక్రమించిన తమ భూభాగం క్రిమియా ద్వీపకల్పంలో ఓ రైలులో తరలిస్తున్న క్రూయిజ్‌ క్షిపణులపై దాడికి పాల్పడింది. ఉత్తర క్రిమియాలోని జంకోయ్‌ పట్టణ సమీపంలో భారీ ఎత్తున కాలిబర్‌ క్రూయిజ్‌ క్షిపణులు ధ్వంసమైన ఘటన పేలుడు వెనుకున్నది తామేనని ఉక్రెయిన్‌ సైనిక అధికార ప్రతినిధి నటాలియా హుమెనుయిక్‌ సూచనప్రాయంగా తెలిపారు. అయితే ఇందుకు పూర్తిగా తమదే బాధ్యతని నేరుగా వెల్లడించలేదు. తాజా చర్య.. 2014లో అక్రమంగా స్వాధీనపరచుకున్న నల్ల సముద్ర ద్వీపకల్పాన్ని తప్పక విడిచిపెట్టాలని రష్యాకు హెచ్చరిక అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌ డ్రోన్లు జంకోయ్‌ పట్టణంలో మౌలిక సదుపాయాలపై దాడులు జరిపాయని క్రెమ్లిన్‌ అధికార వర్గాలు తెలిపాయి. రైల్వే సదుపాయాలపై కాకుండా పౌరుల నివాస ప్రాంతాలను డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని క్రెమ్లిన్‌ నియమిత క్రిమియా అధినేత సెర్గీ అక్సెనోవ్‌ సలహాదారు ఒలేగ్‌ క్రుచ్కోవ్‌ వెల్లడించారు. విద్యుత్‌ లైన్లు సహా ఓ ప్రైవేటు భవనం, దుకాణం, మరో కళాశాల భవంతి దెబ్బతిన్నాయని జంకోయ్‌ పాలనాధిపతి ఇగోర్‌ ఐవిన్‌ తెలిపారు. మరోపక్క అధీకృతం కాని సోషల్‌ మీడియా కథనాలు...రష్యాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థ క్రిమియాపైకి చొచ్చుకొచ్చిన డ్రోన్లను నేలకూల్చిందని పేర్కొన్నాయి.  క్రిమియా ద్వీపకల్పంలో భారీ పేలుడు జరిగిన వీడియో ఒకటి ఆంగ్ల మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. రైల్వే స్టేషన్‌పై ఆ క్షిపణి దాడి జరిగిందని  స్థానికులు వెల్లడిస్తున్నారు. క్రిమియాలో కీలకమైన ఎయిర్‌ ఫీల్డ్‌ల్లో జంకోయ్‌, గార్వెడెస్కోయ్‌లు కీలకమైనవి. వీటిల్లో జంకోయ్‌ కీలక రైల్వే కేంద్రం కూడా. దక్షిణ ఉక్రెయిన్‌ నుంచి ఇక్కడికి కీలకమైన యుద్ధ సామగ్రి సరఫరా అవుతుంది. తాజాగా ఉక్రెయిన్‌ దాడిలో ధ్వంసమైన క్షిపణులు సెవస్తోపోల్‌లోని రష్యా నౌకాదళాలకు అందాల్సి ఉంది.


పశ్చిమదేశాలు ఊ అంటే.. చైనా వద్ద శాంతి ప్రణాళిక: పుతిన్‌

కీవ్‌: పశ్చిమ దేశాలు ముందుకొస్తే ఉక్రెయిన్‌తో సాగుతున్న యుద్ధం పరిష్కారానికి చైనా వద్ద శాంతి ప్రణాళిక ఓ ఆధారాన్ని ఇస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మంగళవారం పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చల అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు బాసటగా ఉన్న పశ్చిమ మిత్రదేశాలు చైనా శాంతి ప్రణాళికపై నిరాశక్తంగా ఉన్నాయని ఆక్షేపించారు. యుద్ధ ట్యాంకుల్లో వినియోగించేందుకు అణు పరికరాలు కలిగిన ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించాలని బ్రిటన్‌ భావిస్తోందని, అదేకనుక జరిగితే రష్యా తగిన విధంగా స్పందిస్తుందని హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని