Russia - Ukraine: అంతర్జాతీయ వేదికపై.. రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధుల గొడవ

తమ స్థాయి, స్థానం మరిచి రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధులు అంతర్జాతీయ వేదికపై గొడవకు దిగారు. రష్యా ప్రతినిధి కవ్వింపు చర్యలతో ఆగ్రహానికి గురైన ఉక్రెయిన్‌ ఎంపీ ఆయనపై దాడికి దిగారు.

Updated : 06 May 2023 09:46 IST

ఇస్తాంబుల్‌: తమ స్థాయి, స్థానం మరిచి రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధులు అంతర్జాతీయ వేదికపై గొడవకు దిగారు. రష్యా ప్రతినిధి కవ్వింపు చర్యలతో ఆగ్రహానికి గురైన ఉక్రెయిన్‌ ఎంపీ ఆయనపై దాడికి దిగారు. ఈ ఘర్షణ తుర్కియే రాజధాని అంకారాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. గత 14 నెలలుగా ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో మొదటిసారి అంకారాలో ‘బ్లాక్‌ సీ ఎకనామిక్‌ కమ్యూనిటీ’ 61వ సమావేశం జరుగుతోంది. ఈ వేదికగా గురువారం ఉక్రెయిన్‌ ఎంపీ ఒలెక్సాండర్‌ మారికోవిస్కీ తన దేశ జెండాను ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే సమయంలో రష్యా ప్రతినిధి ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆ జెండాను లాక్కొని దూరంగా వెళ్లబోయారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎంపీ.. ఆ రష్యా వ్యక్తిపై వేగంగా దూసుకెళ్లి, దాడి చేశారు. ఆ తర్వాత తన జెండాను వెనక్కి తీసుకున్నారు. ఈ ఆకస్మిక చర్యతో అక్కడున్నవారంతా  అవాక్కయ్యారు. ఆ తర్వాత ఇద్దరిని విడదీశారు. ఉక్రెయిన్‌కు చెందిన ఓ మీడియా సంస్థ ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌చేసింది. బ్లాక్‌ సీ ఎకనామిక్‌ కమ్యూనిటీ 30 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. ఇందులో ఉక్రెయిన్‌, రష్యా సభ్యదేశాలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని