అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు లేదు!

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా దర్యాప్తునకు భారత  ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడాలోని భారత రాయబారి సంజయ్‌ కుమార్‌ వర్మ వెల్లడించారు.

Published : 29 Nov 2023 05:58 IST

కీలక కేసుల దర్యాప్తుపై భారత దౌత్యవేత్త వ్యాఖ్యలు

ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా దర్యాప్తునకు భారత  ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడాలోని భారత రాయబారి సంజయ్‌ కుమార్‌ వర్మ వెల్లడించారు. నిజ్జర్‌ హత్య కేసులో మాత్రం కెనడా దర్యాప్తునకు దిల్లీ సహకరించబోదని తేల్చిచెప్పారు. సమాచారం పంచుకునే విషయంలో రెండు దేశాల మధ్య ఉన్న తేడా కారణంగానే భారత ప్రభుత్వ స్పందన కూడా వీరి విషయంలో భిన్నంగా ఉందని ఆయన వివరించారు. కెనడాలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్‌ కుమార్‌ ఈ మేరకు పేర్కొన్నారు.

ఆ ఖలిస్థాన్‌ మద్దతుదారులపై చర్యలు తీసుకోండి

వాషింగ్టన్‌: అమెరికాలోని భారత రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధును కొందరు ఖలిస్థాన్‌ మద్దతుదారులు వెక్కిరించడాన్ని అమెరికా సిక్కుల సంస్థ ఖండించింది. ఆ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ న్యూయార్క్‌ గురుద్వారా యాజమాన్యాన్ని కోరింది. ప్రార్థనలు నిర్వహించుకునే పవిత్ర స్థలాలు గురుద్వారాలని, వాటిని వ్యక్తిగత రాజకీయ ఆలోచనలకు దూరంగా ఉంచాలని సూచించింది. న్యూయార్క్‌లో శాంతియుతులైన సిక్కులు గురుద్వారాకు భయం లేకుండా, స్వచ్ఛందంగా రావాలంటే ఈ అల్లరి సృష్టించిన వారిపై గురుద్వారా సాహిబ్‌ యాజమాన్యం కఠిన చర్యలు చేపట్టాలని అమెరికా సిక్కుల సంస్థ స్థాపకుడు, ఛైర్మన్‌ జస్‌దీప్‌ సింగ్‌ జస్సీ, అధ్యక్షుడు కన్వల్‌జిత్‌ సింగ్‌ సోని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని