నిక్కీ హేలీ అవినీతిపరురాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఆశిస్తున్న అభ్యర్థుల మధ్య నాలుగో విడత చర్చా కార్యక్రమం అలబామా విశ్వవిద్యాలయంలోని మూడీ మ్యూజిక్‌ హాలులో బుధవారం వాడీవేడీగా జరిగింది.

Updated : 08 Dec 2023 06:02 IST

నియంతృత్వ పోకడలు ప్రదర్శిస్తుంటారు
తీవ్ర విమర్శలు గుప్పించిన వివేక్‌ రామస్వామి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఆశిస్తున్న అభ్యర్థుల మధ్య నాలుగో విడత చర్చా కార్యక్రమం అలబామా విశ్వవిద్యాలయంలోని మూడీ మ్యూజిక్‌ హాలులో బుధవారం వాడీవేడీగా జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గైర్హాజరీతో ఈ చర్చలో భారత సంతతి నేతలు నిక్కీ హేలీ, వివేక్‌ రామస్వామితో పాటు ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌, న్యూజెర్సీ మాజీ గవర్నర్‌ క్రిస్‌ క్రిస్టీ మాత్రమే పాల్గొన్నారు. ఈ నలుగురు ట్రంప్‌పై విమర్శల జోలికి వెళ్లకుండా.. తమలో తామే ఆరోపణలు గుప్పించుకున్నారు. ప్రధానంగా నిక్కీ హేలీపై వివేక్‌ రామస్వామి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆమె అవినీతిపరురాలని, నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తుంటారని వివేక్‌ ఆరోపించారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా హేలీ ముఖం చాటేస్తున్నారన్నారు. కార్పొరేట్‌ సంస్థల నుంచి నిధులు తీసుకుని ప్రసంగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. డెమోక్రటిక్‌ పార్టీకి విరాళాలు ఇచ్చే రీడ్‌ హోఫ్మన్‌ అనే బిలియనీర్‌ నుంచి నిక్కీ, ఆమె కుటుంబసభ్యులు 2.5 లక్షల డాలర్లు లబ్ధి పొందారని వివేక్‌ ఆరోపించారు. గత మూడు చర్చా కార్యక్రమాల్లో వివేక్‌ విమర్శలకు దీటుగా బదులిచ్చిన నిక్కీ.. ఈసారి చాలాసేపు మౌనంగానే ఉన్నారు. ఆయన ఆరోపణలకు స్పందించడం ద్వారా తన సమయం వృథా చేసుకోదలుచుకోలేదని మాత్రమే పేర్కొన్నారు. ఒక దశలో హేలీకి మద్దతుగా వివేక్‌పై క్రిస్‌ క్రిస్టీ విమర్శలు గుప్పించారు. ఆయన ఆడంబరం కోసం మాట్లాడే వ్యక్తి అని అన్నారు. ఉక్రెయిన్‌పై రెండు నాల్కల ధోరణి ప్రదర్శించారని విమర్శించారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన భూభాగాన్ని వదిలేయడమే యుద్ధానికి పరిష్కారమని గతంలో చెప్పినట్లు ఆరోపించారు. ఆయన ఆరోపణలను వివేక్‌ ఖండించారు. తాను ఎక్కడా అలా చెప్పలేదని అన్నారు. మరోవైపు ట్రంప్‌ చర్చలో పాల్గొనకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మిగిలిన నలుగురు తనకు సమవుజ్జీలు కాదని ట్రంప్‌ భావిస్తున్నారని, అందుకే ఆయన ముందునుంచీ చర్చలకు హాజరవడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 60 శాతం రిపబ్లికన్‌ ఓటర్ల మద్దతుతో ట్రంప్‌ అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని