అందరికీ కరోనా సోకాలని నేను కోరుకోలేదు

కరోనా వైరస్‌ బ్రిటిష్‌ జనాభా అంతటికీ వ్యాపించాలని తాను కోరుకున్నాననే ఆరోపణలను మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గురువారం ఖండించారు.

Updated : 08 Dec 2023 06:37 IST

బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్పష్టీకరణ

లండన్‌: కరోనా వైరస్‌ బ్రిటిష్‌ జనాభా అంతటికీ వ్యాపించాలని తాను కోరుకున్నాననే ఆరోపణలను మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గురువారం ఖండించారు. ప్రజలపై మరిన్ని ఆంక్షలు విధించే బదులు వైరస్‌ను పాకనిస్తే ప్రజల్లో సహజ రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుందని జాన్సన్‌ అన్నట్లు ఆయన ప్రధాన సైన్స్‌ సలహాదారు తన డైరీలో రాసుకున్నారు. అది గురువారంనాటి బహిరంగ విచారణలో ప్రస్తావనకు వచ్చింది. 2020 సెప్టెంబరు-అక్టోబరు కాలంలో కొవిడ్‌ విజృంభించింది. అప్పటికి టీకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆ రెండు నెలల్లో జాన్సన్‌ ప్రభుత్వం రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ, ఇంటి నుంచి పని వంటి పరిమిత ఆంక్షలు విధించింది. అవి ఫలించడం లేదని గ్రహించి అక్టోబరు 31న రెండో లాక్‌డౌన్‌ ప్రకటించింది. తన ప్రభుత్వం ఆరోగ్యం, ఆర్థిక రంగాలపై కొవిడ్‌ ప్రభావాన్ని సమతుల్యపరచాలని చూసిందని, ఆ క్రమంలో రకరకాల వ్యూహాల గురించి చర్చించామే తప్ప ఉద్దేశపూర్వకంగా జనానికి వైరస్‌ను అంటించాలని కాదని జాన్సన్‌ వివరించారు. భవిష్యత్తులో మరేదైనా మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి కొవిడ్‌ నుంచి నేర్చిన పాఠాలు తోడ్పడతాయనే ఉద్దేశంతో బహిరంగ విచారణ నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని