హిందూ మహాసముద్రంలో బంగ్లాదేశ్‌ నౌక హైజాక్‌

హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. బంగ్లాదేశ్‌ జెండాతో ఉన్న ఓ కార్గో నౌకను హైజాక్‌ చేశారు.

Published : 14 Mar 2024 03:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. బంగ్లాదేశ్‌ జెండాతో ఉన్న ఓ కార్గో నౌకను హైజాక్‌ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు నౌక యాజమాన్యం బుధవారం వెల్లడించింది. నౌకను దుండగులు సోమాలియా తీరం వైపు తీసుకెళ్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌లోని కబీర్‌ స్టీల్‌ అండ్‌ రీరోలింగ్‌ మిల్‌ గ్రూప్‌నకు చెందిన ‘అబ్దుల్లా’ అనే కార్గో నౌక మొజాంబిక్‌ దేశం నుంచి బొగ్గు తీసుకొని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు బయల్దేరింది. ఈ నౌక హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా సముద్రపు దొంగలు అందులోకి చొరబడ్డారు. ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి నౌకను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నారని, వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నౌక యాజమాన్యం తెలిపింది. సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని పేర్కొంది. బంగ్లాదేశ్‌ ఓడలు హైజాక్‌కు గురవడం ఇది రెండోసారి. 2010లో ఇలాగే ఓ నౌకను అరేబియా సముద్రంలో దొంగలు అడ్డగించి తమ అధీనంలోకి తీసుకున్నారు. అందులోని 25 మంది సిబ్బందిని బందీలుగా చేసుకొని దాదాపు వంద రోజుల తర్వాత విడిచిపెట్టారు. తాజా హైజాక్‌ ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు. సోమాలియా పైరెట్లే దీనికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని