బ్రిటన్‌లో ఆశలు నింపిన ‘కార్‌ టి’!

క్యాన్సర్‌ బాధితులకు విప్లవాత్మక చికిత్సలను తెచ్చేందుకు బ్రిటన్‌లో ప్రారంభించిన వినూత్న పథకం ఆశలు చిగురింపచేస్తోంది.

Updated : 31 Mar 2024 05:39 IST

క్యాన్సర్‌కు వినూత్న చికిత్స
తొలిసారిగా భారత సంతతి కుర్రాడికి..

లండన్‌: క్యాన్సర్‌ బాధితులకు విప్లవాత్మక చికిత్సలను తెచ్చేందుకు బ్రిటన్‌లో ప్రారంభించిన వినూత్న పథకం ఆశలు చిగురింపచేస్తోంది. దీని కింద ‘కార్‌ టి’ అని ఈ చికిత్సను భారత సంతతికి చెందిన యువన్‌ ఠక్కర్‌ మొట్టమొదట పొందారు. అది ఫలించి ఇప్పుడు తనకు ఇష్టమైన పనులను చేసుకోగలుగుతున్నానని అతడు చెబుతున్నాడు. బ్రిటన్‌ ప్రభుత్వ నిధులతో నడిచే నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌.. క్యాన్సర్‌ డ్రగ్స్‌ ఫండ్‌ (సీడీఎఫ్‌)ను ఏర్పాటుచేసింది. 2016 జులైలో దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ కేర్‌ ఎక్సెలెన్స్‌ (నైస్‌) ఆమోదం పొందిన అన్నిరకాల క్యాన్సర్‌ చికిత్సలకు వేగంగా బాధితులకు అందుబాటులోకి తీసుకురావడం, ఆ చికిత్స విధానాల దీర్ఘకాల సమర్థతపై మరిన్ని ఆధారాలు సేకరించడం దీని ఉద్దేశం. దీనిద్వారా వందకుపైగా ఔషధాలను రోగులకు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం దీని ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య లక్షకు చేరింది. వీరిలో ఠక్కర్‌ కూడా ఉన్నాడు. ఆరేళ్ల వయసులో అతడికి ఒకరకం లుకేమియా వచ్చింది. కీమోథెరపీ, బోన్‌ మారో ట్రాన్స్‌ప్లాంట్‌ వంటి ఇతర చికిత్సలు విఫలమయ్యాక 2019 అతడికి ‘కార్‌ టి’ చికిత్సను ఇచ్చారు. దీనివల్ల తన జీవితం మారిందని యువన్‌ ఠక్కర్‌ చెప్పాడు. ‘‘గతంలో అనేకసార్లు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది. చాలాకాలం పాటు పాఠశాలకు దూరంగా ఉండాల్సి వచ్చేది. కొత్త చికిత్స వల్ల నేను గణనీయంగా కోలుకున్నా. స్నూకర్‌ వంటి ఆడుకోవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులను కలుసుకోగలగడం వంటివి చేయగలుగుతున్నా’’ అని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని