మేం చేసింది ఘోర తప్పిదమే

తమ దళాల దాడిలో ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌’ (డబ్ల్యూసీకే) స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆరుగురు విదేశీ సిబ్బంది, భారత సంతతికి చెందిన పాలస్తీనా డ్రైవర్‌ గాజాలో ప్రాణాలు కోల్పోవడంపై ఇజ్రాయెల్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

Updated : 04 Apr 2024 05:41 IST

అంగీకరించిన ఇజ్రాయెల్‌
సహాయక సిబ్బంది మృతిపై విచారం
ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదంటూ వివరణ
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆగ్రహం

గాజా: తమ దళాల దాడిలో ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌’ (డబ్ల్యూసీకే) స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆరుగురు విదేశీ సిబ్బంది, భారత సంతతికి చెందిన పాలస్తీనా డ్రైవర్‌ గాజాలో ప్రాణాలు కోల్పోవడంపై ఇజ్రాయెల్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తమవైపు నుంచి ఘోర తప్పిదం జరిగిందని పేర్కొంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదంటూ వివరణ ఇచ్చింది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపింది. గాజాకు ఆహారం సరఫరా చేస్తున్న డబ్ల్యూసీకే బృందంపై మంగళవారం ఇజ్రాయల్‌ దళాలు చేసిన దాడిలో ముగ్గురు బ్రిటన్‌ వాసులు, ఆస్ట్రేలియా, పోలండ్‌, అమెరికా, కెనడాకు చెందిన నలుగురు మృతి చెందారు. ఓ పాలస్తీనా డ్రైవర్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. క్షేత్రస్థాయిలో క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో లక్ష్యాన్ని గుర్తించడంలో పొరపడ్డామని ఇజ్రాయెల్‌ సైన్యాధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ హెర్జీ హలేవీ తెలిపారు. దీన్ని ఘోర తప్పిదంగా అంగీకరించిన ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

దాడిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుల ప్రాణాలను రక్షించడానికి ఇజ్రాయెల్‌ తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ‘‘వారు యుద్ధం మధ్యలో ఆకలితో ఉన్న పౌరులకు ఆహారం అందిస్తున్నారు. ధైర్యంగా, నిస్వార్థంగా సేవలందిస్తున్నారు. వారి మృతి తీరని లోటు. సహాయక సిబ్బంది వాహనాలపై వైమానిక దాడి ఎందుకు జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్‌ తెలిపింది. అది వేగంగా జరగాలి. దాని ఫలితాలను బహిరంగపరచాలి. ఈ ఘటన ఒక్కటే కాదు.ఈ యుద్ధంలో ఎంతో మంది సహాయక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గాజాలో మానవతా సాయం క్లిష్టంగా మారింది. సామాన్యులకు సేవలందిస్తున్న వారి రక్షణకు ఇజ్రాయెల్‌ తగిన చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణం’’ అని బైడెన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

గాజాలో ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనా పౌరులకు కావాల్సిన సాయం అందించేందుకు చేస్తున్న కృషిని అమెరికా కొనసాగిస్తుందని బైడెన్‌ తెలిపారు. అందుకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామన్నారు. వారికి సాయం చేరేలా వెసులుబాటు కల్పించాలని ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెస్తామని చెప్పారు. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. కైరోలో ఓ బృందం దీనిపైనే పనిచేస్తోందని వెల్లడించారు.మరోవైపు మృతుల్లో బ్రిటన్‌ పౌరులు కూడా ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి రిషి సునాక్‌ స్పందించారు. దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన ఇజ్రాయెల్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గాజాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా దాడిపై వీలైనంత వేగంగా, స్వతంత్రంగా, పారదర్శకంగా విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. నెతన్యాహుతో సునాక్‌ ఫోన్‌లో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని