భారత్‌ ప్రగతి చిహ్నం మోదీ: షెర్మన్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ ఆర్థిక ప్రగతికి ప్రతీకగా నిలుస్తున్నారని సీనియర్‌ అమెరికన్‌ పార్లమెంటు (కాంగ్రెస్‌) సభ్యుడు బ్రాడ్‌ షెర్మన్‌ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశంసించారు.

Published : 11 Apr 2024 04:10 IST

వాషింగ్టన్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ ఆర్థిక ప్రగతికి ప్రతీకగా నిలుస్తున్నారని సీనియర్‌ అమెరికన్‌ పార్లమెంటు (కాంగ్రెస్‌) సభ్యుడు బ్రాడ్‌ షెర్మన్‌ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశంసించారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిననాటి నుంచి మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన కొనియాడారు. 140 కోట్ల భారతీయులు కలసికట్టుగా తమ దేశాన్ని విజయపథంలో పరుగులు పెట్టించడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. మోదీ హయాంలో భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడ్డాయని, రష్యాతో భారత్‌ రక్షణ బంధం మాత్రం ఒక సమస్యగా ఉందని వివరించారు. అదే సమయంలో భారత్‌-అమెరికాల సంయుక్త సైనిక విన్యాసాలు, సహకారం వృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. పాలక డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన 69 ఏళ్ల షెర్మన్‌ కాంగ్రెస్‌ విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు. 28 ఏళ్లుగా భారత్‌-అమెరికా బంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఆయనకు భారతదేశ మిత్రుడని పేరు. పాలక డెమొక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్లతో ఏర్పడిన అమెరికా-ఇండియా కాకస్‌కు షెర్మన్‌ గతంలో అధ్యక్షుడిగా పనిచేశారు. అమెరికాలోని భారతీయులు అత్యున్నత విద్యావంతులు, అత్యధిక ఆర్జన పరులని షెర్మన్‌ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. లాస్‌ ఏంజెలెస్‌లో కూడా భారత దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని