అమెరికాలో భార్యను చంపిన భారతీయుడిపై రూ.2.1 కోట్ల రివార్డు

అమెరికాలో భార్యను చంపి పరారైన ఓ భారతీయుడిపై ఎఫ్‌బీఐ భారీ రివార్డును ప్రకటించింది. నిందితుడి వివరాలు తెలియజేసిన వారికి 2.5 లక్షల డాలర్లు (దాదాపు రూ.2.1కోట్లు) అందజేస్తామని తెలిపింది.

Published : 14 Apr 2024 05:18 IST

ఎఫ్‌బీఐ ప్రకటన

వాషింగ్టన్‌: అమెరికాలో భార్యను చంపి పరారైన ఓ భారతీయుడిపై ఎఫ్‌బీఐ భారీ రివార్డును ప్రకటించింది. నిందితుడి వివరాలు తెలియజేసిన వారికి 2.5 లక్షల డాలర్లు (దాదాపు రూ.2.1కోట్లు) అందజేస్తామని తెలిపింది. తొమ్మిదేళ్ల క్రితం మేరీల్యాండ్‌లోని హానోవర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. భద్రేశ్‌ కుమార్‌ చేతన్‌భాయ్‌ పటేల్‌, అతడి భార్య పాలక్‌ స్థానికంగా ఉండే ఓ డోనట్‌ దుకాణంలో పని చేసేవారు. 2015 ఏప్రిల్‌ 12న (హత్య జరిగిన రోజున) వీరిద్దరూ నైట్‌ షిఫ్ట్‌లో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కిచెన్‌లో పనిచేస్తున్న పాలక్‌పై నిందితుడు పలుమార్లు కత్తితో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ పాలక్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎఫ్‌బీఐ నిందితుడి కోసం తీవ్రంగా గాలించింది. హత్య అనంతరం అతడు తన అపార్ట్‌మెంట్‌కు వచ్చి కొన్ని వస్తువులు తీసుకుని న్యూజెర్సీ విమానాశ్రయానికి వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. ఆ తర్వాత అతడి జాడలేదు. అప్పటినుంచి నిందితుడి కోసం గాలిస్తున్న ఎఫ్‌బీఐ.. 2017లో అతడిని టాప్‌టెన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. తాజాగా రివార్డు ప్రకటించింది. వీసా గడువు తీరడంతో పాలక్‌ భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకోగా, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భద్రేశ్‌ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. నిందితుడు కెనడా లేదా భారత్‌కు పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు