నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే

అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది.

Published : 19 Apr 2024 06:00 IST

అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. ఈ వివరాలు.. ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా.. కొవిడ్‌-19 మహమ్మారి విజృంభణ సాగిన మొదటి రెండేళ్లలో సగటు ఆయుర్దాయాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగినా.. వారి జీవనం ఆరోగ్యంగా సాగడంలేదని ఇందులో వెల్లడైంది. ‘‘అంతర్జాతీయంగా అనారోగ్యానికి ప్రధాన కారణం నడుం నొప్పి. దాన్ని ఎదుర్కోవడానికి ప్రస్తుతమున్న చికిత్సలు సరిగా ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన డేమియన్‌ శాంటోమారో తెలిపారు. దీన్ని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. కుంగుబాటు సమస్యలకు నిర్దిష్ట కాలంపాటు చికిత్సలు, ఔషధాలను కొనసాగిస్తే ప్రయోజనం ఉండొచ్చని తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ఇవి అందుబాటులో ఉండటంలేదన్నారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలో కుంగుబాటు సమస్యలు తీవ్రస్థాయిలో పెరిగినందువల్ల.. ఈ ఇబ్బంది ఉన్నవారికి చికిత్స అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన ఇతరత్రా దుష్ప్రభావాలు మహిళలపైనే ఎక్కువగా ఉందని చెప్పారు. దీనిలో దీర్ఘకాల కొవిడ్‌, మానసిక సమస్యలు వంటివి ఉన్నాయన్నారు. అయితే ఇన్‌ఫెక్షన్‌ వల్ల మహిళలతో పోలిస్తే పురుషులకే మరణం ముప్పు అధికంగా ఉందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని