మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్‌కు ఆయుధాలు

ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌, తైవాన్‌తో పాటు.. ఇండో పసిఫిక్‌ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్‌ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్‌ 79-18తో ఆమోదముద్ర తెలిపింది.

Updated : 25 Apr 2024 05:46 IST

రూ.8 లక్షల కోట్ల సైనిక సాయంపై సంతకం అనంతరం బైడెన్‌ వ్యాఖ్య

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌, తైవాన్‌తో పాటు.. ఇండో పసిఫిక్‌ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్‌ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్‌ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. ఇంతకుముందు ప్రతినిధుల సభ ఆమోదం పొందిన ఈ బిల్లుపై బుధవారం అధ్యక్షుడు బైడెన్‌ సంతకం చేశారు. సైనిక సాయంలో భాగంగా మరి కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపిస్తామని చెప్పారు. అంతకుముందు ‘‘రష్యా నుంచి బాంబుల దాడిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు ఇది చాలా అత్యవసరమైన బిల్లు. ఇరాన్‌ నుంచి దాడులు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కి, ఇండో పసిఫిక్‌ స్థిరత్వానికి కూడా ఈ బిల్లు కీలకమే’’ అని బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఈ 95.3 బిలియన్‌ డాలర్ల విలువైన బిల్లులో 60.8 బిలియన్‌ డాలర్లు ఉక్రెయిన్‌కు, 26.4 బిలియన్‌ డాలర్లు ఇజ్రాయెల్‌కు, 8.1 బిలియన్‌ డాలర్లు తైవాన్‌, ఇండో పసిఫిక్‌ ప్రాంతానికి అందనున్నాయి. తైవాన్‌కు సైనిక ప్యాకేజీ ప్రకటించడంపై చైనా మండిపడింది. ఇది అమెరికా అనుసరిస్తున్న ఒకే చైనా విధానానికి విరుద్ధమని పేర్కొంది.

అమెరికా అధికారికంగానే కాదు రహస్యంగానూ ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. నెల రోజుల క్రితం కొన్ని దీర్ఘశ్రేణి క్షిపణులను పంపింది. తాజాగా రష్యాపై వాటిని వినియోగించడం కీవ్‌ ప్రారంభించింది. ఈ క్షిపణులతో ఉక్రెయిన్‌ సామర్థ్యం రెట్టింపైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని