ఆ ఘటనతోనే భారత్‌తో వాణిజ్య బంధానికి తెర : పాక్‌

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్‌ దిగుమతులపై భారత్‌ అధిక సుంకాలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌ దర్‌ అన్నారు.

Published : 20 May 2024 04:50 IST

ఇస్లామాబాద్‌: పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్‌ దిగుమతులపై భారత్‌ అధిక సుంకాలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌ దర్‌ అన్నారు. అందుకే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు నిలిచిపోయాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ దేశ నేషనల్‌ అసెంబ్లీకి శనివారం ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘పుల్వామా ఘటన తర్వాత పాక్‌ నుంచి చేసుకొనే దిగుమతులపై 200 శాతం సుంకం విధించాలని భారత్‌ నిర్ణయించింది. కశ్మీర్‌ బస్సు సేవలతోపాటు సరిహద్దు వెంట వాణిజ్య కార్యకలాపాలనూ నిలిపేసింది’ అని ఆయన వెల్లడించారు. భారత్‌ సహా పొరుగు దేశాలతో పాక్‌ ఎదుర్కొంటున్న సవాళ్లేంటని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ విషయంలో పాక్‌ వ్యాపార వర్గాలు ఎదురుచూస్తున్నాయని మార్చిలో లండన్‌లో జరిగిన ఓ సమావేశంలో ఇషాక్‌ తెలిపారు. అనంతరం భారత్‌తో వాణిజ్యాన్ని పునరుద్ధరించే ప్రణాళికలేవీ లేవని ఆయన కార్యాలయం మరో ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే విధానానికి స్వస్తి పలకాలని భారత్‌ డిమాండ్‌ చేస్తోంది. తద్వారా ఇతర సమస్యల పరిష్కారానికి సానుకూల వాతావరణాన్ని కల్పించే బాధ్యత పాక్‌పైనే ఉందని స్పష్టం చేస్తోంది. దాయాది దేశం మాత్రం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి నిర్మాణాత్మక చర్యలూ తీసుకోవడం లేదు. పైగా తమ భూభాగం నుంచి ఉగ్రకార్యకలాపాలు కొనసాగడం లేదంటూ నమ్మబలుకుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని