తైవాన్‌ చుట్టూ మోహరించిన చైనా

తైవాన్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.  తైవాన్‌ నూతన అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌-తె  సోమవారం బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో తమను బెదిరించడం ఆపాలంటూ డ్రాగన్‌ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

Updated : 24 May 2024 05:45 IST

తారస్థాయికి చేరుకుంటున్న ఉద్రిక్తతలు

బీజింగ్‌/తైపీ: తైవాన్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.  తైవాన్‌ నూతన అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌-తె  సోమవారం బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో తమను బెదిరించడం ఆపాలంటూ డ్రాగన్‌ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇవి చైనాకు ఆగ్రహం తెప్పించాయి. ఇందుకు శిక్షగా తాము తైవాన్‌ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపడుతున్నట్లు ప్రకటించింది. గురువారం ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ఈ ద్వీపం చుట్టూ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)కి చెందిన ఈస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ మిలటరీ విన్యాసాలు ప్రారంభించింది. ‘‘స్వాతంత్య్రం కోరుతున్న వేర్పాటువాద శక్తులకు ఇది బలమైన శిక్ష. మమ్మల్ని రెచ్చగొడుతూ, మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొనే బాహ్య శక్తులకు ఇది మా తీవ్ర హెచ్చరిక’’ అని కమాండ్‌ అధికార ప్రతినిధి లి షీ తెలిపారు. తైవాన్‌ జలసంధితో పాటు ఈ ద్వీపం మిగిలిన మూడు దిక్కుల్లో డ్రాగన్‌ రెండు రోజుల పాటు ఈ విన్యాసాలు కొనసాగించనుంది. ఆర్మీ, నేవీ, వాయుసేన, రాకెట్‌ దళాలు సంయుక్తంగా ఇందులో పాల్గొన్నాయి. చైనా విన్యాసాల నేపథ్యంలో తైవాన్‌ అప్రమత్తమైంది. పరిస్థితులు తీవ్రంగా మారితే తక్షణమే ప్రతిస్పందించేందుకు వీలుగా యుద్ధ విమానాలను, క్షిపణులను సిద్ధంగా ఉంచింది. నేవీ, ఆర్మీ యూనిట్లను అలర్ట్‌ చేసింది. చైనా విన్యాసాలను తైవాన్‌ రక్షణ శాఖ తీవ్రంగా ఖండించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని