రైసీ హెలికాప్టర్‌పై దాడి జరగలేదు: ఇరాన్‌

ఇరాన్‌ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణానికి దారితీసిన హెలికాప్టర్‌ ప్రమాదంపై ఆ దేశ సాయుధ దళాల జనరల్‌ స్టాఫ్‌ తొలి నివేదికను విడుదల చేశారు.

Published : 25 May 2024 05:41 IST

టెహ్రాన్‌: ఇరాన్‌ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణానికి దారితీసిన హెలికాప్టర్‌ ప్రమాదంపై ఆ దేశ సాయుధ దళాల జనరల్‌ స్టాఫ్‌ తొలి నివేదికను విడుదల చేశారు. ఘటన తర్వాత వివిధ విభాగాలకు చెందిన నిపుణులతో కూడిన దర్యాప్తు బృందం ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు నివేదికను ఉటంకిస్తూ తస్నిమ్‌ వార్తా సంస్థ తెలిపింది. హెలికాప్టర్‌పై ఎలాంటి దాడి జరగలేదని నివేదిక స్పష్టం చేసింది. ‘‘హెలికాప్టర్‌ నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించింది. నిర్దేశిత మార్గాన్ని దాటి వెళ్లలేదు. ప్రమాదం సంభవించడానికి దాదాపు 90 సెకన్ల ముందు కూలిన హెలికాప్టర్‌ పైలట్‌.. కంట్రోల్‌ టవర్‌తో మాట్లాడారు. శకలాల్లో బుల్లెట్లు లేదా ఇతర పేలుడుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. కొండను ఢీకొట్టిన తర్వాత హెలికాప్టర్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. రాత్రంతా గాలింపు కొనసాగింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటలకు డ్రోన్‌ల సహాయంతో ఘటన జరిగిన కచ్చితమైన ప్రదేశం తెలిసింది’’ అని నివేదికలో పేర్కొన్నారు. హెలికాప్టర్‌ సిబ్బంది, వాచ్‌టవర్‌ మధ్య జరిగిన సంప్రదింపుల్లో ఎలాంటి అనుమానాస్పద సంభాషణలను గుర్తించలేదని, పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత మిగిలిన విషయాలు వెల్లడిస్తామని నివేదికలో అధికారులు తెలిపారు. ఆదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో రైసీ, విదేశాంగమంత్రి అబ్దొల్లాహియన్‌ సహా మరో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని