యుద్ధం అంతానికి ఇది ఆరంభం

ఖేర్సన్‌లో రష్యా దళాలు తోకముడవడం యుద్ధం అంతానికి ఆరంభం అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభివర్ణించారు.

Published : 15 Nov 2022 04:25 IST

ఖేర్సన్‌ విముక్తిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్య
ఆ ప్రాంతంలో పర్యటన

ఖేర్సన్‌: ఖేర్సన్‌లో రష్యా దళాలు తోకముడవడం యుద్ధం అంతానికి ఆరంభం అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభివర్ణించారు. శత్రు దళాలను తరిమికొట్టేందుకు దేశ సైనికులు భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా ఆక్రమణ నుంచి విముక్తి పొందిన ఉక్రెయిన్‌ దక్షిణప్రాంత కీలక నగరం ఖేర్సన్‌లో జెలెన్‌స్కీ సోమవారం పర్యటించారు. అక్కడ సెంట్రల్‌ స్క్వేర్‌లో ఉక్రెయిన్‌ దళాలతో ముచ్చటించారు. అయితే జెలెన్‌స్కీ పర్యటనపై స్పందించేందుకు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తిరస్కరించారు. పైగా ఆ ప్రాంతం రష్యా సమాఖ్యకు చెందిన భూభాగమని స్పష్టం చేశారు. రష్యా తిరోగమనం తరువాత ఆ ప్రాంతంలో వారు పాల్పడ్డ హింస, ఇతర దురాగతాలపై ఆధారాలు సేకరిస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధికారవర్గాలు వెల్లడించాయి. రష్యా దురాక్రమణ నుంచి స్వేచ్ఛావాయులు పొంది సంబరాలు చేసుకుంటున్న ఖేర్సన్‌ వాసులు విద్యుత్‌ సౌకర్యం, నీరు, ఆహారం, మందుల కొరతను ఎదుర్కొంటున్నారు. కాగా విశాల ఖేర్సన్‌ ప్రాంతంలో 70 శాతం రష్యా ఆధీనంలోనే ఉంది.

రష్యా మద్దతుదారులపై అమెరికా కొరడా

రష్యాకు సైనిక పరంగా మద్దతుపలుకుతున్న వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సోమవారం అమెరికా ప్రకటించింది. ఫ్రెంచ్‌ స్థిరాస్తి సంస్థలు, స్విట్జర్లాండ్‌కు చెందిన పలువురు వ్యక్తులు, తైవాన్‌కు చెందిన మైక్రోఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్‌ కొనుగోలు సంస్థ.. అగ్రరాజ్యం తాజా ఆర్థిక, దౌత్య ఆంక్షలకు గురయ్యాయి. ఈ సంస్థలు, వ్యక్తులకు రష్యా సైన్యానికి ఆర్థికంగా చేయూతనందించడం లేదా సరఫరాలను అందిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది.

ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ అధిపతిపై ఈయూ ఆంక్షలు

ఉక్రెయిన్‌పై యుద్ధంలో వినియోగించేందుకు రష్యాకు చౌకైన డ్రోన్లు(యూఏవీ), క్షిపణులను ఎగుమతి చేసిందన్న కారణంగా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ జనరల్‌ హొస్సైన్‌ సలామిపై ఐరోపా సమాజం (ఈయూ) సోమవారం ఆంక్షలు విధించింది. ఇరాన్‌ మానవ రహిత వైమానిక వాహనాల అభివృద్ధి కార్యక్రమం, వాటిని విదేశాలకు తరలించడం వంటి అంశాలపై హొస్సైన్‌కు నియంత్రణ ఉంటుందన్న నేపథ్యంలో ఈ చర్యకు ఉపక్రమించింది. రివల్యూషనరీ గార్డ్‌ ఏరోస్పేస్‌ ఫోర్స్‌, కమాండింగ్‌ జనరల్‌పైనా, క్వాడ్స్‌ ఏవియేషన్‌ ఇండస్ట్రీస్‌పైనా ఆంక్షలు పెట్టింది. షహెద్‌-136, మొహజెర్‌-6 రకానికి చెందిన డ్రోన్లను రష్యాకు అందించారని, ఆ దేశం ఉక్రెయిన్‌పై యుద్ధంలో వాటిని వినియోగించిందని ఈయూ ఆరోపించింది.

మరోవైపు ఇరాన్‌లో మహిళలు చేపట్టిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను దారుణంగా అణచివేయడంలో పాత్ర నేపథ్యంలో ఇరాన్‌ హోంమంత్రి అహ్మద్‌ వాహిద్‌ సహా పలువురు సీనియర్‌ పోలీసు, సైనికాధికారులు 29 మందిపై ఈయూ ఆంక్షలు విధించింది. ఇదే అంశమై ఇరాన్‌ సమాచారశాఖ మంత్రి ఇస్సా ఝరేపౌర్‌ సహా పలువురు అధికారులపై ఇంగ్లండ్‌ కూడా ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఆయా వ్యక్తుల ఆస్తుల స్తంభన, వారి ప్రయాణాలపై నిషేధం అమల్లో ఉంటుంది.


రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి సెర్గీ లవ్రోవ్‌కు ఆరోగ్య పరీక్షలు?

నుసా దువా(ఇండోనేసియా): బాలిలో జీ-20 సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి సెర్గీ లవ్రోవ్‌ ఆసుపత్రిలో ఆరోగ్యపరీక్షలు చేయించుకున్నట్లు ఇండోనేసియా అధికార వర్గాలు వెల్లడించాయి. బాలి రాష్ట్ర రాజధాని డెన్‌పాసార్‌లోని సాంగ్లాహ్‌ ఆసుపత్రికి లవ్రోవ్‌ను ఆరోగ్య పరీక్షల కోసం తీసుకువెళ్లినట్లు బాలి గవర్నర్‌ ఐ వయన్‌ కోస్టర్‌ తెలిపారు. కొన్ని పరీక్షల అనంతరం లవ్రోవ్‌ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారని, ఆయన ఆరోగ్యం బాగుందని చెప్పారు. అంతకుముందు ఇండోనేసియా ప్రభుత్వ ఆరోగ్య అధికారులు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ లావ్రోవ్‌కు ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు వెల్లడించారు. ఆయనకు గుండె సంబంధించి చికిత్స అందించినట్లు తెలిపారు. ఈ విషయమై ఆసుపత్రి వర్గాల నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడం గమనార్హం. అయితే రష్యా విదేశీవ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మరియా ఝఖారోవా మాట్లాడుతూ లవ్రోవ్‌ ఆసుపత్రి పాలయ్యారనే వార్తలను ఖండించారు. ఇది నకిలీ వార్త అని పేర్కొన్నారు. లవ్రోవ్‌ ఆరోగ్యంగా కనిపిస్తున్న ఓ వీడియోను ఆమె విడుదల చేశారు. అందులో లవ్రోవ్‌ మాట్లాడుతూ.. పదేళ్లుగా మా అధ్యక్షుడు (పుతిన్‌) అనారోగ్యం పాలయ్యారంటూ వాళ్లు రాస్తూనే ఉన్నారు. ఇది కూడా అలాంటి ఆటే. రాజకీయాల్లో ఇదేమీ కొత్త కాదు అని వ్యాఖ్యానించారు. మరోపక్క ‘‘నేను హోటల్‌లో ఉన్నాను. మంగళవారం నాటి సదస్సుకు సంబంధించి సమాచారాన్ని చదువుకుంటున్నాను’’ అని లవ్రోవ్‌ చెప్పినట్లుగా రష్యా అధికార వార్తా సంస్థ టాస్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని