ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా క్షిపణులు

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులు మరోసారి విరుచుకుపడ్డాయి.

Updated : 06 Dec 2022 05:50 IST

ఒడెశా, చెర్కసీ, క్రీవీ రిహ్‌ సహా పలు నగరాల్లో విధ్వంసం
రష్యా వైమానిక స్థావరాల్లో పేలుళ్లు
ముగ్గురు సైనికుల మృతి

కీవ్‌, మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులు మరోసారి విరుచుకుపడ్డాయి. ఒడెశా, చెర్కసీ, క్రీవీ రిహ్‌ సహా పలు నగరాలపై జరిగిన ఈ దాడులు ఆయా ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించినట్లు ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయని, పలువురు పౌరులు మృతి చెందారని, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగి పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొందని వివరించారు. మిస్సైల్‌ దాడితో పంపింగ్‌ స్టేషన్లకు విద్యుత్‌ సౌకర్యం నిలిచిపోయిందని ఒడెశాలోని స్థానిక జల పంపిణీ సంస్థ వెల్లడించింది. దీంతో నగరం మొత్తానికి నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపింది. ‘‘ఉక్రెయిన్‌ భూభాగంపై శత్రువు మరోసారి క్షిపణులతో దాడికి పాల్పడ్డాడు’’ అని అధ్యక్ష కార్యాలయ ఉపాధ్యక్షుడు కిరిలో టిమోషెంకో సామాజిక మాధ్యమం టెలిగ్రామ్‌లో తెలిపారు. రష్యా దాడులపై  దేశమంతటా అప్రమత్తత ప్రకటించి..సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ రష్యాలోని భూభాగం, కాస్పియన్‌, నల్ల సముద్రాల్లోని యుద్ధ నౌకలు, ఆ దేశ వ్యూహాత్మక బాంబర్ల నుంచి క్షిపణుల దాడి జరిగినట్లు ఉక్రెయిన్‌ వైమానిక దళం అధికార ప్రతినిధి యూరి ఇహ్నాత్‌ పేర్కొన్నారు. అయితే రష్యా ప్రయోగించిన మొత్తం 70 క్షిపణుల్లో 60 మిస్సైళ్లను అడ్డుకున్నట్లు ఉక్రెయిన అధికారులు వెల్లడించారు.

టీయూ-95, టీయూ-160ల స్థావరంలో పేలుడు?

ఇదిలా ఉండగా రష్యాలోని రెండు వైమానిక స్థావరాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అయితే ఈ పేలుళ్లకు కారణాలేమిటన్నది ఇటు ఉక్రెయిన్‌, అటు రష్యా అధికారులు వెల్లడించలేదు. రియాజన్‌ వైమానిక స్థావరంలో చమురు ట్రక్కు పేలిపోయిన సందర్భంగా ముగ్గురు సైనికులు మృతి చెందారని, ఆరుగురు గాయపడ్డారని, ఓ విమానం దెబ్బతిన్నట్లు ఆర్‌ఐఏ నోవోస్తీ వార్తా సంస్థ వెల్లడించింది. ఓల్గా నది సమీపంలోని సరతోవ్‌ ప్రాంతంలో ఏంజెల్స్‌ వైమానిక స్థావరంలో పేలుడు చోటుచేసుకుందన్న కథనాలపై పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ స్థావరంలో రష్యా ప్రతిష్ఠాత్మక టీయూ-95, టీయూ-160 వ్యూహాత్మక బాంబర్లను నిలిపి ఉంచుతారు. ఇవి అణ్వాయుధాలను కూడా మోసుకుపోగల సామర్థ్యం కలవి.

బ్యారెల్‌ చమురుకు 60 డాలర్ల విధానం షురూ

రష్యా విక్రయించే చమురు బ్యారెల్‌కు 60 డాలర్ల చొప్పున నిర్ణయించిన ధరను, కొన్ని రకాల చమురుపై నిషేధాన్ని పశ్చిమ దేశాలు సోమవారం నుంచి అమలు పరచడం ప్రారంభించాయి. ఐరోపా సమాజం (ఈయూ), ఆస్ట్రేలియా, బ్రిటన్‌, కెనడా, జపాన్‌, అమెరికాలు రష్యా చమురు ధరపై శుక్రవారం పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా ఆ ధర తమకు సమ్మతం కాదని తెలిపిన విషయం విదితమే.


క్రిమియా వంతెనపై పుతిన్‌ ప్రయాణం

గత అక్టోబరు నెలలో ట్రక్కు బాంబు దాడిలో ధ్వంసమైన క్రిమియా వంతెనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతన్‌ సోమవారం మెర్సిడెస్‌ వాహనాన్ని నడిపారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు. నిర్మాణపనుల్లో పాల్గొన్న కార్మికులతోనూ ఆయన సంభాషించారు. ఈ మేరకు ప్రభుత్వ సీనియర్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆ వారధి రష్యా ప్రధాన భూభాగంతో క్రిమియా ద్వీపాన్ని అనుసంధానం చేస్తుంది. 2014లో రష్యా క్రిమియాను తన ఆధీనంలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని