Blue Origin: రోదసిలోకి తెలుగుతేజం

తెలుగు తేజం గోపీచంద్‌ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్‌ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు.

Published : 20 May 2024 06:15 IST

 విజయవంతంగా యాత్ర పూర్తి చేసిన గోపీచంద్‌ తోటకూర
 అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత పర్యాటకుడిగా రికార్డు 

వాషింగ్టన్‌: తెలుగు తేజం గోపీచంద్‌ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్‌ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ రూపొందించిన న్యూషెపర్డ్‌-25 (ఎన్‌ఎస్‌-25) వ్యోమనౌకలో గోపీచంద్‌ ఈ యాత్ర పూర్తిచేశారు. తాజా యాత్రలో గోపీచంద్‌తోపాటు వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ మేసన్‌ ఏంజెల్, ఫ్రాన్స్‌ పారిశ్రామికవేత్త సిల్వైన్‌ చిరోన్, అమెరికా టెక్‌ వ్యాపారి కెన్నెత్‌ ఎల్‌ హెస్, సాహస యాత్రికురాలు కరోల్‌ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్‌ ఎడ్‌ డ్వైట్‌ పాల్గొన్నారు. డ్వైట్‌ 1961లో అంతరిక్షయానానికి ఎంపికైన తొలి ఆఫ్రోఅమెరికన్‌ వ్యోమగామి. వివిధ కారణాల వల్ల ఆయనకు రోదసిలోకి వెళ్లే అవకాశం రాలేదు. ఇప్పుడు 90 ఏళ్ల వయసులో ఆ కల నెరవేరింది. రోదసియాత్ర చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు. 

న్యూషెపర్డ్‌ రాకెట్‌కు ఇది ఏడో మానవసహిత అంతరిక్షయాత్ర. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9.36 గంటలకు పశ్చిమ టెక్సాస్‌లోని ప్రయోగ వేదిక నుంచి ఇది నింగిలోకి దూసుకెళ్లింది. దీని ఎగువ భాగంలోని క్యాప్సూల్‌లో ఆరుగురు యాత్రికులు ఆసీనులయ్యారు. యాత్ర సమయంలో ఈ రాకెట్‌ ధ్వని కన్నా మూడు రెట్లు వేగంతో దూసుకెళ్లింది. ఇది నేల నుంచి 100 కిలోమీటర్ల ఎగువన ఉండే కార్మాన్‌ రేఖను దాటి వెళ్లింది. ఈ రేఖను భూవాతావరణానికి, అంతరిక్షానికి సరిహద్దుగా పరిగణిస్తారు. ఈ దశలో రాకెట్‌ బూస్టర్‌.. క్యాప్సూల్‌ నుంచి వేరైంది. వ్యోమనౌకలోని వారు కొద్దిసేపు భారరహిత స్థితిని అనుభవించారు. క్యాప్సూల్‌లోని అద్దాల కిటికీల ద్వారా పుడమికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను వీక్షించారు. అనంతరం పారాచూట్ల సాయంతో క్యాప్సూల్‌ నేలపైకి దిగివచ్చింది. దానికి కొద్దినిమిషాల ముందు రాకెట్‌ బూస్టర్‌ కూడా సురక్షితంగా ల్యాండ్‌ అయింది.

భారత పౌరుడే..

భారత్‌కు చెందిన రాకేశ్‌ శర్మ.. 1984లో అంతరిక్షయానం చేశారు. ఆ తర్వాత కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల కూడా రోదసి యాత్రలు చేసినప్పటికీ.. వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. గోపీచంద్‌ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయనకు భారత పాస్‌పోర్టు ఉంది. అందువల్ల రాకేశ్‌ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు. దీనికితోడు ఆయన పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేశారు. తద్వారా భారత తొలి స్పేస్‌ టూరిస్టుగా గుర్తింపు పొందారు.  విజయవాడలో పుట్టిన గోపీచంద్‌ తోటకూర.. అట్లాంటా శివారులోని ‘ప్రిజర్వ్‌ లైఫ్‌’ సంస్థకు సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నారు. గోపీచంద్‌ పైలట్‌గానూ శిక్షణ పొందారు. వాయు మార్గంలో రోగుల అత్యవసర తరలింపు విభాగంలో సేవలు అందించారు. హాట్‌ ఎయిర్‌ బెలూన్లు, గ్లైడర్లు, సీప్లేన్లు నడిపారు. ఆయన ‘ఎంబ్రీ-రిడిల్‌ ఏరోనాటికల్‌ యూనివర్సిటీ’ నుంచి ఏరోనాటికల్‌ సైన్స్‌లో బీఎస్సీ పూర్తి చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని