Haiti: హైతీలో జైలు బద్దలు.. వందల మంది ఖైదీల పరారు..!

హైతీ దేశం రణరంగంగా మారింది. దేశ రాజధానిలో నేరగాళ్లు స్వైరవిహారం చేస్తున్నారు.

Updated : 03 Mar 2024 15:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హైతీ (Haiti) రాజధాని పోర్ట్‌ అ ప్రిన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. తీవ్రమైన నేరాలు చేసిన వారిని బంధించే జైలును బద్దలు కొట్టుకొని వందలమంది ఖైదీలు శనివారం తప్పించుకొన్నారు. ఈ విషయాన్ని ఆ దేశ పోలీస్‌ యూనియన్స్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్టు చేసింది. రాజధానిలో ఉన్న అందరు అధికారులు తక్షణమే కార్లు, ఆయుధాలు తీసుకొని జైలును అదుపు చేయడానికి రావాలని అభ్యర్థించింది. ‘‘దాడి చేసేవారు పూర్తిగా విజయం సాధిస్తే దాదాపు 3,000 మంది నేరగాళ్లు పట్టణంలోకి వస్తారు.. ఎవరినీ వదిలిపెట్టరు’’ అని దానిలో పేర్కొంది. 

కెన్యాతో ఓ రక్షణ ఒప్పందం చేసుకోవడానికి ప్రధాని ఏరియల్‌ హెన్రీ ఇటీవల కెన్యా పర్యటనకు వెళ్లిన సమయంలో దేశ రాజధానిలో నేరగాళ్ల ముఠాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. పోలీస్‌ స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లను వీరు లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అమెరికా విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేశాయి. 

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌పై డ్రోన్‌ దాడి

ఇదే సమయంలో దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరగాళ్లను ఉంచే పోర్ట్‌ అ ప్రిన్స్‌ జైలుపై దాడులు మొదలయ్యాయి. ఈ జైల్లో దేశాధ్యక్షుడి హంతకులతోపాటు.. 18మంది కొలంబియా వాసులు కూడా ఉన్నారు. దీని సామర్థ్యం 3,900 కాగా.. 11,778 మంది ఖైదీలు ఇక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో జైలుపై శనివారం దుండగులు దాడి నిర్వహించారు. దీనిలో బాజ్‌-5 ముఠా హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. జైలుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు కెన్యాతో ఒప్పందం అమల్లోకి వస్తే.. ఆ దేశ దళాలు హైతీ రక్షణకు సాయం చేస్తాయి.  దీనిపై ఓ నేరగాళ్ల ముఠా నాయకుడు జిమ్మీ చెరిజియర్‌ అలియాస్‌ బార్బెక్యూ ప్రధాని హెన్రీని పదవి నుంచి దిగిపోయేట్లు చేస్తామన్నారు. ‘‘పోలీసులు, సైన్యమే ప్రధానిని అరెస్టు చేయాలి’’ అని డిమాండ్‌ చేశాడు. జిమ్మీ గతంలో పోలీస్‌ అధికారిగా పనిచేశాడు. ఆ తర్వాత గ్యాంగులతో సంబంధాలు పెట్టుకొని నేరగాడిగా మారాడు. అతడిపై అమెరికా, ఐరాస ఆంక్షలు ఉన్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని