Houthis: భారత్‌-బ్రిటన్‌ సముద్రగర్భ కమ్యూనికేషన్‌ కేబుల్‌పై హూతీల దాడి..!

హూతీలు కీలకమైన సముద్రగర్భ కేబుల్స్‌ను ధ్వంసం చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీటిల్లో భారత్‌ వినియోగించేవి కూడా ఉన్నట్లు చెబుతున్నారు. 

Updated : 27 Feb 2024 12:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు జీవనాడి వంటి సముద్రగర్భ కేబుల్స్‌పై హూతీలు (Houthis) దాడులు  మొదలుపెట్టినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా భారత్‌-బ్రిటన్‌ మధ్య ఉన్న కమ్యూనికేషన్‌ లైన్‌ సహా నాలుగింటిపై దాడులు చేసినట్లు కథనాలు వెలుడుతున్నాయి. వీటిల్లో భారత్‌-ఐరోపా మధ్య సేవలు అందించేవి అధికంగా ఉన్నట్లు భావిస్తున్నారు. యెమన్‌ తీర జలాల అడుగు నుంచి పరిచిన నాలుగు కమ్యూనికేషన్‌ తీగలు ఈ దాడుల్లో దెబ్బతిన్నట్లు సమాచారం. వీటిల్లో ఒక దానిని నిర్వహించే సంస్థ ఇప్పటికే ఈ అంశాన్ని ధ్రువీకరించింది. 

దెబ్బతిన్నవి ఏమిటీ..

మొత్తం నాలుగు సముద్ర గర్భ కమ్యూనికేషన్‌ లైన్లు దెబ్బతిన్నట్లు జెరూసలెంపోస్ట్‌, గ్లోబెక్స్‌ కథనాలు పేర్కొన్నాయి. డేటాసెంటర్‌ డైనమిక్స్ ఇదే రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దెబ్బతిన్న వాటిల్లో ఏఏఈ-1, సీకామ్‌, యూరప్‌-ఇండియా గేట్‌వే, టాటా గ్లోబల్‌ నెట్‌వర్క్‌ అట్లాంటిక్‌కు చెందినవి ఉన్నట్లు తెలుస్తోంది. 

* ఏఏఈ-1 కేబుల్‌: ఇది తూర్పు ఆసియాను ఈజిప్ట్‌ మీదుగా ఐరోపాతో అనుసంధానిస్తుంది. అంతేకాదు.. చైనాను ఖతర్‌, పాకిస్థాన్‌ మీదుగా పశ్చిమ దేశాలతో కలుపుతుంది.

* యూరప్‌ ఇండియా గేట్‌వే (ఈఐజీ) కేబుల్‌:  దక్షిణ ఐరోపా ప్రాంతం మీదుగా ఈజిప్ట్‌, సౌదీ, జిబూటి, యూఏఈ, భారత్‌కు కమ్యూనికేషన్‌ సేవలు అందిస్తుంది . 

* సీకామ్‌ కేబుల్‌: ఐరోపా, ఆఫ్రికా, భారత్‌, దక్షిణాఫ్రికా దేశాలను అనుసంధానిస్తుంది. సీకామ్‌-టాటా కమ్యూనికేషన్స్‌ కలిసి పనిచేస్తాయి. 

గతంలోనే హెచ్చరికలు..

ఎర్ర సముద్రంలో నౌకల రక్షణకు అమెరికా సంకీర్ణసేనలు సిద్ధమైన వేళ.. బాబ్‌-ఎల్‌-మండెప్‌ వద్ద నుంచి వెళ్లే సముద్ర గర్భ ఇంటర్నెట్‌ కేబుళ్లను ధ్వంసం చేస్తామని హూతీలు హెచ్చరించారు.  ఈ మేరకు వారు టెలిగ్రామ్‌లో సందేశాలు ఉంచారు. కొన్ని అండర్‌సీ కేబుల్స్ చిత్రాలను కూడా పోస్టు చేశారు. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌, బ్యాంకింగ్‌ వంటి కీలక సేవలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.

ప్రపంచ ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌లో 17శాతానికి సంబంధించిన కేబుల్స్‌ ఈజిప్ట్‌లోని సూయజ్‌, బాబ్‌-ఎల్‌-మండెప్‌ జలసంధుల మీదుగా ఐరోపా-ఆసియా ప్రాంతాలను కలుపుతున్నాయి. ముఖ్యంగా గేట్‌ ఆఫ్‌ టియర్స్‌గా పేరున్న యెమెన్‌-జిబూటీ, ఎరిత్రియా మధ్య సముద్రం వెడల్పు కేవలం దాదాపు 32 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ కొన్ని వందల మీటర్ల లోతులో ఈ తీగలను పర్చారు. సాధారణ డైవర్లు ఇక్కడికి చేరడం దాదాపు అసాధ్యం. అమెరికా, రష్యా నౌకాదళాలకు మాత్రమే వీటిని కత్తిరించే సామర్థ్యం ఉంది. ప్రత్యేకమైన పరికరాలు, వాహనాలను దీనికోసం వాడాల్సి ఉంటుంది. హూతీలు డైవర్లు, నౌకలకు వాడే మైన్లను వినియోగించి వీటిని ధ్వంసం చేసే అవకాశాలుండొచ్చని అనుమానిస్తున్నారు. 

మరమ్మతులకు కొన్ని వారాలు..? 

 వేర్వేరు మార్గాల్లో ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను అనుసంధానించే నెట్‌వర్క్‌లు ఉండటంతో ఈ దాడి వల్ల పెద్దగా సమస్య ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్నెట్‌ పర్యవేక్షక సంస్థ నెట్‌బ్లాక్స్‌ మాత్రం జిబూటీలో ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు ఎక్స్‌లో ధ్రువీకరించింది. సీకామ్‌ సంస్థ కూడా నెట్‌వర్క్‌ సమస్యలు గుర్తించినా.. లోపాలను కచ్చితంగా చెప్పలేకపోతున్నట్లు పేర్కొంది. మరమ్మతులకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. తాజాగా దెబ్బతిన్న కేబుల్స్‌ను సరి చేయడానికి కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. 

అసలేమిటీ అండర్‌సీ కేబుల్స్‌..

1858లో ప్రపంచంలోనే తొలిసారి సముద్రంలో టెలిగ్రాఫ్‌ కేబుల్స్‌ వేశారు. అట్లాంటిక్‌ టెలిగ్రాఫ్‌ కంపెనీ ఈ పనిచేసింది. అంతర్జాతీయ కమ్యూనికేషన్లు, ఆర్థిక వ్యవస్థకు ఇది కీలకంగా మారింది. ప్రస్తుతం సముద్ర గర్భంలో 300కు పైగా కీలక ఫైబర్‌ఆప్టిక్‌ లైన్లు ఉన్నాయి. ఫోన్‌కాల్స్‌, రోజువారీ జరిగే బిలియన్‌ డాలర్ల కొద్దీ అంతర్జాతీయ నగదు లావాదేవీలు, దౌత్య సందేశాలు వంటివి వీటి నుంచే జరుగుతుంటాయి. ప్రపంచ కమ్యూనికేషన్లలో 90శాతానికి ఇవే దిక్కు. భారత్‌కు వివిధ ప్రాంతాలతో జరిగే కమ్యూనికేషన్లలో 50శాతం, ఖతర్‌కు 60శాతం, ఒమన్‌కు 70శాతం, యూఏఈకి 80శాతం, కెన్యాకు 90శాతం ఈ మార్గం నుంచే వెళతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని