Aroh Barjatya: అమెరికా పరిశోధక రాకెట్లు.. మిషన్‌ సారథి భారత సంతతి వ్యక్తే

ఇటీవల సూర్యగ్రహణం సందర్భంగా ‘నాసా’ మూడు పరిశోధక రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్‌కు సారథ్యం వహించింది ఓ భారత సంతతి వ్యక్తే కావడం విశేషం. 

Published : 12 Apr 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల సూర్యగ్రహణం (Solar Eclipse) సందర్భంగా అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా (NASA)’ మూడు పరిశోధక రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది. సూర్యగ్రహణం వేళ భూగ్రహంపై సూర్యకాంతి మసకబారినప్పుడు ఎగువ వాతావరణం ఎలా ప్రభావితమవుతుందో అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. ఈ మిషన్‌కు సారథ్యం వహించింది భారత సంతతి వ్యక్తే కావడం విశేషం. ఆయనే ఆరోహ్‌ బడ్జాత్యా (Aroh Barjatya). నాసా ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘ఫ్లోరిడాలోని ఎంబ్రీ-రిడిల్‌ ఏరోనాటికల్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ ఆరోహ్‌ ఈ మిషన్‌కు నేతృత్వం వహించారు. ఆయన అదే యూనివర్సిటీలోని స్పేస్‌, ఎట్మాస్ఫియరిక్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు’’ అని నాసా తెలిపింది. వర్జీనియాలోని వాలోప్స్ ప్రయోగ కేంద్రం నుంచి ‘ఎట్మాస్ఫియరిక్ పెర్టర్బేషన్స్ అరౌండ్‌ ఎక్లిప్స్ పాత్ (APEP)’ పరిశోధక రాకెట్లను ప్రయోగించారు. గ్రహణానికి 45 నిమిషాల ముందు, గ్రహణం సమయంలో, ఆ తర్వాత 45 నిమిషాలకు వీటిని ప్రయోగించారు. ఆ సమయంలో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌కు కీలకమైన అయనోస్ఫియర్‌లోని మార్పులను ఈ రాకెట్లలోని పరికరాలు నమోదు చేశాయి.

బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌

ఆరోహ్‌ తండ్రి అశోక్‌కుమార్‌ కెమికల్‌ ఇంజినీర్‌, తల్లి రాజేశ్వరి గృహిణి. ముంబయి, హైదరాబాద్‌, జైపుర్‌, పిలానీ, సోలాపుర్‌ తదితర ప్రాంతాల్లో విద్యాభ్యాసం సాగింది. సోలాపుర్‌లోని వాల్‌చంద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. 2001లో అమెరికాకు వెళ్లిన ఆయన.. యూటా స్టేట్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ పూర్తి చేశారు. అదే విశ్వవిద్యాలయం నుంచి స్పేస్‌క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. ‘‘ఆరు నెలల్లో ఆరు క్లిష్టమైన రాకెట్ మిషన్లు నిర్వహించేలా సహకరించిన తోటి పరిశోధకులు, నాసాకు కృతజ్ఞతలు’’ అని లింక్డ్‌ఇన్‌లోని పోస్ట్‌లో ఆరోహ్ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని